
చెన్నై : తెలంగాణకు చెందిన కబడ్డీ ఆటగాళ్లను తమిళనాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చెన్నైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కబడ్డీ మ్యాచ్ ఆడేందుకు పుదుచ్చేరి వెళ్లిన తెలంగాణ ఆటగాళ్లు తిరుగు ప్రయాణంలో భాగంగా చెన్నైకి చేరుకున్నారు. అక్కడ కోచ్తో కలిసి కొందరు ఆటగాళ్లు అన్నా సలై నుంచి ఎగ్మోర్ వెళ్లేందుకు 29ఏ నెంబర్ బస్సు ఎక్కారు.
అయితే టికెట్ తీసుకునే సమయంలో బస్సు కండక్టర్తో కబడ్డీ కోచ్ లక్ష్మణ్కు మధ్య ఘర్షణ మొదలైంది. అయితే ఎగ్మోర్లో కబడ్డీ ఆటగాళ్లు బస్సు దిగిన సమయంలో వారిపై కండక్టర్ దాడికి యత్నించాడు. కండక్టర్కు మద్ధతుగా స్థానికులు కూడా కోచ్ లక్ష్మణ్తోపాటు ఆటగాళ్లపై దాడి చేశారు. ఈ ఘటనపై సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కోచ్తో పాటు కబడ్డీ ఆటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీశారు. కబడ్డీ కోచ్ అనుచిత ప్రవర్తనతో ఈ ఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. తొలుత లక్ష్మణ్ కండక్టర్పై దాడికి పాల్పడినట్టుగా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో తమ తప్పేమిలేదని తెలంగాణ ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.