23న ఒకే వేదికపై రాజ్, అమితాబ్ ! | Raj Thakre, Amithab Bachan to share same venue | Sakshi
Sakshi News home page

23న ఒకే వేదికపై రాజ్, అమితాబ్ !

Dec 21 2013 12:12 AM | Updated on May 28 2018 4:05 PM

బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలిద్దరూ సోమవారం ఒకే వేదికపై దర్శనమివ్వనున్నారు.

సాక్షి, ముంబై: బాలీవుడ్ బాద్‌షా అమితాబ్ బచ్చన్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేలిద్దరూ సోమవారం ఒకే వేదికపై దర్శనమివ్వనున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా వీరి మధ్య నెలకొన్న వివాదాలకు తెరపడి సయోధ్య కుదిరిందని భావిస్తున్నారు. 2008లో జరిగిన ఓ కార్యక్రమంలో అమితాబ్ సతీమణి, బాలీవుడ్ నటి అయిన జయా బచ్చన్ మాట్లాడుతూ ‘నాది యూపీ.. నేను హిందీలోనే మాట్లాడతానని’ ప్రకటించింది. ఆమె వ్యాఖ్యల అనంతరం మరాఠీ ప్రజలకోసం పోరాడుతున్న రాజ్ ఠాక్రే, బచ్చన్ కుటుంబీకుల మధ్య వివాదాలు ప్రారంభమయ్యాయి.
 
 ఆ సమయంలో జయా బచ్చన్ తరఫున అమితాబ్ క్షమాపణ కూడా చెప్పారు. అయినప్పటికీ ఆ సంఘటన అనంతరం రాజ్, అమితాబ్‌ల మధ్య దూరం ఏర్పడింది. అయితే తాజాగా సోమవారం జరగనున్న ఓ కార్యక్రమం కోసం ఎమ్మెన్నెస్ తరఫున అమితాబ్‌కు స్వాగత పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘ఎమ్మెన్నెస్ చిత్రపట్ (చలనచిత్ర) సేన’ ఆధ్వర్యంలో చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మాటుంగా షణ్ముఖానంద్ హాల్‌లో సోమవారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమితాబ్ బచ్చన్ హాజరుకానున్నారు. మరోవైపు ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అంతకుముందు వీరిద్దరూ 2008లో జరిగిన శివసేన అధినేత బాల్ ఠాక్రే ఫొటో బయోగ్రఫీ విడుదల కార్యక్రమంలో కలసి పాల్గొన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement