రాజకీయ నేత కుమారుడి హత్య | politician son murdered | Sakshi
Sakshi News home page

రాజకీయ నేత కుమారుడి హత్య

Aug 9 2016 2:57 AM | Updated on Sep 17 2018 5:17 PM

తిరుచ్చి సమీపాన రాజకీయ నేత కుమారుడు హత్యకు గురయ్యాడు. తిరుచ్చి తెన్నూరు మారియమ్మన్ ఆలయం వీధికి చెందిన అన్నాదురై

తిరుచ్చి సమీపంలో ఉద్రిక్తత
 టీనగర్: తిరుచ్చి సమీపాన రాజకీయ నేత కుమారుడు హత్యకు గురయ్యాడు. తిరుచ్చి తెన్నూరు మారియమ్మన్ ఆలయం వీధికి చెందిన అన్నాదురై(43) పందిరి కాంట్రాక్టర్. పుదియ తమిళగం పార్టీ తిరుచ్చి దక్షిణ జిల్లా కార్యకర్తల విభాగం కార్యదర్శిగా ఉన్నాడు. ఇతని భార్య జయ, కుమారుడు ప్రభు అలియాస్ ప్రభాకరన్(23). ఇతను కెమికల్ కంపెనీలో కారు డ్రైవర్. ఇతనికి భార్య, ఏడాది వయసుగల కుమారుడు ఉన్నారు. ఇదే ప్రాంతానికి చెందిన రాజా(27) స్నేహితులు.
 
 కొన్ని రోజుల క్రితం టాస్మాక్ దుకాణంలో రాజా, ప్రభు మద్యం తాగారు. ఆ సమయంలో ఇద్దరికి జరిగిన గొడవలోప్రభు, రాజాపై దాడి చేశాడు. ఆదివారం రాత్రి ప్రభు బైక్‌లో నిలుచుని తండ్రి అన్నాదురైతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన రాజా, అతని స్నేహితులు దినేష్‌కుమార్ (22), పాండియరాజన్ (22) ప్రభుపై కత్తులతో దాడి చేశారు. దీన్ని అడ్డుకున్న అతని తండ్రి అన్నాదురైపై కూడా దాడి జరిపారు. దీన్ని గమనించిన జయ వారిని అడ్డుకోడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో వారు జయను కిందకు తోసి పరారయ్యారు. ఇందులో ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి.
 
 ఆమె కేకలు విన్న స్థానికులు రక్తపు మడుగులో పడిన ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రభు మృతిచెందాడు. అన్నాదురైకు వైద్య చేస్తున్నారు. దీంతో ప్రభు బంధువులు ఆస్పత్రికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుపై తిల్లైనగర్ పోలీసు స్టేషన్‌లో ఐదు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. టాస్మాక్ దుకాణంలో ప్రభు, రాజాపై దాడి జరిపినందున అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రాజా వేచిచూసినట్లు, ఆదివారం రాత్రి అతన్ని హతమార్చినట్లు తెలిసింది.  దీంతో రాజా, దినేష్‌కుమార్, పాండియరాజన్‌లను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement