
పెట్రో మంటలు
యూపీఏ హయాంలో పెట్రోల్, డీజిల్తో పాటుగా అన్ని రకాల ధరల మోత ప్రజల జీవితాల్ని పిప్పి చేసిన విషయం తెలిసిందే.
పెట్రో, డీజిల్ ధరల పెంపుపై సర్వత్రా వ్యతిరేకత బయలుదేరింది. వెనక్కు తీసుకోవాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. చమురు కంపెనీల తీరుపై జయలలిత, డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పెంపు తమకు సంబంధం లేదని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు.
⇒ రాజకీయ పక్షాల ఆగ్రహం
⇒ వెనక్కు తీసుకోవాలని డిమాండ్
⇒ సంబంధం లేదన్న పొన్ రాధాకృష్ణన్
⇒ పెంపును నిరసిస్తూ ఆందోళనలు
సాక్షి, చెన్నై : యూపీఏ హయాంలో పెట్రోల్, డీజిల్తో పాటుగా అన్ని రకాల ధరల మోత ప్రజల జీవితాల్ని పిప్పి చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపించింది. యూపీఏ పతనంతో అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోదీ సారథ్యంలోని ప్రభుత్వంతోనూ ప్రజలకు ఒరిగింది శూన్యమే. తమ జీవితాల్లో మార్పులు వస్తాయని, ధరలు దిగి వస్తాయన్న ప్రజల ఆశలు అడియాశలు అవుతూనే ఉన్నాయి. తాజాగా, పెట్రోల్ డీజిల్ ధరలపై ఇటీవల కాలంగా కనీవిని రీతిలో ధరల మోత మోగించడం సర్వత్రా ఆగ్రహాన్ని రేపుతున్నది.
పెట్రోల్పై రూ. 4.18, డిజిల్పై 2.55 పెంచి రాత్రికి రాత్రే అమల్లోకి తీసుకురావడంతో యూపీఏ పాలనను ఎన్డీఏ గుర్తుకు తెస్తున్నదని చెప్పవచ్చు. చమురు సంస్థలు తీసుకున్న ఈ పెంపు నిర్ణయంతో అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలు మరింత మండే అవకాశాలు నెలకొన్నాయి. దీంతో రాజకీయ పక్షాలు ఈ పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని చోట్ల పెంపును నిరసిస్తూ ఆందోళనలు జరిగాయి.
నేతల ఆగ్రహం: పెట్రో, డీజిల్ ధరల పెంపును అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తీవ్రంగా ఖండించారు. పేద, మధ్య తరగతి వర్గాలు అనేక కష్టాలు పడుతున్న సమయంలో ఇలా ధరల్ని పెంచడం భావ్య మా అని ప్రశ్నించారు. యూపీఏ బాటలో నే కొత్త ప్రభుత్వం నడుస్తున్నదని స్పష్టం అవుతోందన్నారు. అంతర్జాతీ మార్కెట్లో ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ , అమాంతంగా ధరల్ని పెంచడాన్ని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నామన్నారు. యూపీఏ హయాంలో పెట్రోల్ డీజిల్ ధరల నిర్ణయాధికారం చమురు కంపెనీల చేతిలోకి వెళ్లాయని, ఇప్పుడు ఆ పద్ధతిని మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని పదే పదే డిమాండ్ చేస్తున్నా పట్టించుకోక పోవడం శోచనీయమని విమర్శించారు.
డీఎంకే అధినేత ఎం కరుణానిధి తన ప్రకటనలో ధరల పెంపును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పీఎంకే నేత రాందాసు, యువజన నేత అన్భుమణి, ఎండీఎంకే నేత వైగో, ఎస్ఎంకే నేత శరత్కుమార్, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, టీఎంసీ నేత జీకే వాసన్, టీఎన్సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, వీసీకే నేత తిరుమావళవన్, ఎంఎంకే నేత జవహరుల్లా, నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్ తదితరులు తమ ప్రకటనల్లో ధరల పెంపును వ్యతిరేకించారు. ధరల్ని ఇష్టానుసారంగా పెంచుతూ పోతుంటే, ఆ భారం ప్రజల మీద పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికా రు. పెంపును వెనక్కు తీసుకోకుంటే, ఆం దోళనలకు దిగుతామని హెచ్చరించారు.