ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం కోసం మంగళవారం నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం కోసం మంగళవారం నుంచి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో వృద్ధాప్య పింఛన్ల అంశాన్ని లేవనెత్తనున్నట్లు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తెలిపింది. పింఛన్లు రాకపోవడంతో నగరంలో వేల మంది వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ అంటోంది. పింఛన్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కూడా వారి సమస్యను పరిష్కరించే నాథుడు కనిపించడం లేదని ఆరోపించింది. వృద్ధాప్య పింఛన్ల కోసం కొత్త దరఖాస్తులను స్వీకరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2012లో వృద్ధాప్య పింఛన్ల కోసం కొత్త దరఖాస్తులను స్వీకరించడం నిలిపివేసిందని బీజేపీ శాసనసభ నేత విజేందర్ గుప్తా చెప్పారు.
రాష్ట్రపతి పాలన కాలంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ కోసం సమర్పించిన బడ్జెట్లో కొత్తగా 40 వేల వృద్ధ్యాప్య పింఛన్ల కోసం నిధులు కేటాయించారని ఆయన గుర్తుచేశారు. దీంతో 40 వేల మంది వృద్ధులు ప్రయోజనం పొందారని పేర్కొన్నారు. ఆప్ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ కొత్త దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. రానున్న ఓట్ ఆన్ అకౌంట్లో ప్రభుత్వం కొత్త పింఛన్ల కోసం కేటాయింపులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం 60 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారికి నెలకు రూ. వెయ్యి, 70 ఏళ్లకు పైబడినవారికి రూ. 1,500 ఢిల్లీ సర్కారు పింఛనుగా ఇస్తోంది.