
ప్రాణం పోస్తే.. బ్లాక్మెయిల్ చేశారు
ఆపరేషన్ చేసి ప్రాణంపోస్తే నిరాధార ఆరోపణలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని భారతిరాజా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నటేశన్, డాక్టర్ మారన్, సీఈవో కేవీ శ్రీనివాసన్ ఆవేదన వ్యక్తం చేశారు.
చెన్నై : ఆపరేషన్ చేసి ప్రాణంపోస్తే నిరాధార ఆరోపణలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని భారతిరాజా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నటేశన్, డాక్టర్ మారన్, సీఈవో కేవీ శ్రీనివాసన్ ఆవేదన వ్యక్తం చేశారు. రోగులకు అంకితభావంతో సేవలందించే వైద్యులను రచ్చకీడ్చడం తగదని వారు హితవు పలికారు.
నుంగంబాక్కంకు చెందిన గౌరీశంకర్ భార్య అముద (35) గత ఏడాది ఆగస్టులో ఒబేసిటీ ఆపరేషన్ను చేయించుకున్నారు. ఆ కుటుంబం తమ ఆసుపత్రికి బాగా పరిచయస్తులు, కుటుంబ మిత్రులు వంటివారు కావడం తో అదనపు శ్రద్ధతీసుకున్నాం. డిశ్చార్జి అయిన కొన్ని నెలలకు ఆమెకు కొన్ని రుగ్మతలు తలెత్తగా ఒబేసిటీ ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ మారన్ ఇందుకు కారకులని ఆమె, ఆమె భర్త ఆరోపిస్తూ మెడికల్ కౌన్సిల్కు, పోలీసుకు ఫిర్యాదులు చేశారు. డాక్టర్కు వ్యతిరేకంగా నగరంలో పోస్టర్లు అంటించడం, ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించడం వంటి కార్యకలాపాలకు పాల్పడ్డారు.
ఈ నేపథ్యంలో అముదకు ఆపరేష న్ నిర్వహించిన డాక్టర్ మారన్ శుక్రవారం మీడియాకు వివరణ ఇచ్చారు. ఆయన మాటల్లోనే గత ఏడాది ఆగస్టు 11వ తేదీన అముదకు లాప్రోస్కోపిక్ ఆపరేషన్ నిర్వహించాం. ఆరోగ్యకరమైన స్థితిలో 14వ తేదీన ఆమె డిశ్చార్జ్ అయ్యారు. వారం రోజుల తరువాత కుట్లు విప్పించుకునేందుకు వచ్చినపుడు ఆమె ఆరోగ్యంగా కోలుకుంటున్నట్లు గుర్తించాము. తా ము సూచించిన జాగ్రత్తలను పాటించకుండా తీవ్రస్థాయిలో నిర్లక్ష్యం చేశారు. అంతేగాక జిమ్ కు వెళ్లి కఠినమైన వ్యాయామం చేయడంతో మరింతనొప్పి ఏర్పడడంతో వైద్యుల సలహా తీసుకోకుండా ఆమె ఏదో టానిక్ సేవించారు.
ఒబేసిటీ చికిత్స చేసినచోట ఎటువంటి సమస్య లేకున్నా ఆమె కడుపులో ఏదో ద్రవం ఉన్నట్లు వైద్య పరీక్షలో గుర్తించి సెప్టంబర్ 19వ తేదీన శస్త్రచికిత్స చేసి తొలగించగా 22వ తేదీన ఆమె ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. భార్య అముదకు వరుస ఆపరేషన్ల వల్ల తాను ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాను, సాయం చేయండని వేడుకోవడంతో తిరిగి చెల్లించే షరతుపై *5లక్షల నగదు అందజేశాను. ‘మీరు అన్నవంటి వారని అముద సైతం కన్నీళ్లు పెట్టి వేడుకోవడంతో వైద్య ఖర్చుల నిమిత్తం వారిపై నమ్మకంతో మరోసారి బ్లాంక్ చెక్ ఇచ్చాను. ఆపరేషన్ చేసుకున్న వ్యక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను మళ్లీ నిర్లక్ష్యం చేయడం వల్ల మరోసారి ఆరోగ్యం విషమించగా తన ఆర్థిక సహాయంతో మరో కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఆమె మళ్లీ శస్త్రచికిత్స చేసుకున్నారు.
వైద్యపరిభాషలోని పదాలకు వక్రభాష్యం చెబుతూ కడుపులో స్పాంజ్, చెత్త ఉంచిన ందునే ఇన్ని శస్త్రచికిత్సలు అవసరం ఏర్పడిందని ఆ దంపతులు తనను ఆరోపిస్తున్నారు. మానవతా దృక్పథంతో తానిచ్చిన బ్లాంక్ చెక్ను అడ్డంపెట్టుకుని బ్లాక్మెయిల్కు పాల్పడడంతో తేనాంపేట పోలీస్ స్టేషన్లో వారిపై ఫిర్యాదు చేశానని మారన్ అన్నారు. తాను చేసిన ఆపరేషన్లో తప్పుజరగలేదని ఖచ్చితంగా చెబుతున్నానని, చట్టపరంగా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
గౌరీశంకర్ దంపతుల వద్ద సాక్ష్యాధారాలు ఉంటే తనపై కోర్టుకు ఎక్కవచ్చు, వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయవచ్చని ఆయన సవాల్ చేశారు. అయితే ఇవేమీ చేయకుండా ఆసుపత్రి ముందు ధర్నాకు దిగడం, తనపై పోస్టర్లు అంటించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. పేదలనే సానుభూతితో ఆ దంపతులకు తానుచేసిన ఆర్థిక సహాయమే తన మెడకు చుట్టుకున్నందుకు చింతిస్తున్నానని అన్నారు.