అవయవదానంతో ముగ్గురి ప్రాణాలు కాపాడిన వృద్ధుడు | Organ donation With Three survivors Saves Elderly man | Sakshi
Sakshi News home page

అవయవదానంతో ముగ్గురి ప్రాణాలు కాపాడిన వృద్ధుడు

Feb 26 2015 11:53 PM | Updated on Sep 2 2017 9:58 PM

తను మరణిస్తూ అవయవదానంతో మరో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టాడు ఓ వృద్ధుడు (66). వివరాలు...

సాక్షి, ముంబై: తను మరణిస్తూ అవయవదానంతో మరో ముగ్గురి ప్రాణాలు నిలబెట్టాడు ఓ వృద్ధుడు (66). వివరాలు... డోంబివలిలో నివాసముంటున్న జయంతిలాల్ భానుశాలి నవీముంబైలో క్యాషియర్, అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. అయితే ఇటీవల కార్యాలయంలో పనిచేస్తూ కళ్లు తిరిగి పడిపోవడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి మెరుగవకపోవడంతో కుటుంబ సభ్యులు మరో ఆస్పత్రికి తరలించారు. కాగా, నవీముంబైలోని ఆస్పత్రి వైద్యులు రోగి పరిస్థితి గురించి బంధువులకు వివరించారు.

అవయవదానం పట్ల కూడా అవగాహన కల్పించారని రోగి బంధువులు తెలిపారు. భానుశాలిని కాపాడేందుకు చివరి ప్రయత్నంగా జుపిటర్ ఆస్పత్రిలో చేర్పించగా, అక్కడి వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా గుర్తించారు. దీంతో అతని బంధువులు జుపిటర్ ఆస్పత్రిలోని 39 ఏళ్ల వ్యక్తికి కాలేయం, 62 ఏళ్ల వ్యక్తికి కిడ్నీని దానం చేశారు. మరో కిడ్నీని సైఫీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి దానం చేశారు. ఈ సందర్భంగా జుపిటర్ ఆస్పత్రి వైద్యులు గౌతమ్ రమా కాంత్ మాట్లాడుతూ.. బ్రెయిన్ డెడ్ అయిన రోగిని కాపాడేందుకు ఎంతో ప్రయత్నం చేశామన్నారు.

అతను ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో పరిస్థితి గురించి రోగి బంధువులకు వివరించామన్నారు. అవయవ దానం గురించి చెప్పగానే రోగి బంధువులు వెంటనే ఒప్పుకున్నారని వైద్యులు పేర్కొన్నారు. అవయవదానం చేయడం ద్వారా చాలా మంది ప్రాణాలు కాపాడవచ్చని, నగర వాసులు అవయవదానం పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యుడు అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement