నెలమంగల వద్ద నానో | Nano Technology Institute | Sakshi
Sakshi News home page

నెలమంగల వద్ద నానో

Sep 2 2014 1:49 AM | Updated on Sep 2 2017 12:43 PM

నెలమంగల వద్ద నానో

నెలమంగల వద్ద నానో

దేశంలోనే తొలి నానో టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను నగర శివారులోని నెలమంగల వద్ద స్థాపించనున్నట్లు భారత రత్న, నానో టెక్నాలజీ కర్ణాటక విజన్ గ్రూపు చైర్మన్ ప్రొఫెసర్ సీఎన్‌ఆర్.

  • భూ కేటాయింపులకు సమ్మతించిన ప్రభుత్వం
  •  నాలుగు నెలల్లో పనులు పూర్తి
  •  సీఎన్‌ఆర్ రావు వెల్లడి
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  దేశంలోనే తొలి నానో టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను నగర శివారులోని నెలమంగల వద్ద స్థాపించనున్నట్లు భారత రత్న, నానో టెక్నాలజీ కర్ణాటక విజన్ గ్రూపు చైర్మన్ ప్రొఫెసర్ సీఎన్‌ఆర్. రావు తెలిపారు. డిసెంబరు నాలుగు నుంచి మూడు రోజుల పాటు జరుగనున్న ‘ఏడవ బెంగళూరు ఇండియా నానో’ను పురస్కరించుకుని సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

    ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానో టెక్నాలజీ అండ్ సాఫ్ట్ మెటల్స్’ పేరిట ఏర్పాటు చేయనున్న ఈ సంస్థ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. దీనికి 16 ఎకరాలను కేటాయించడానికి ప్రభుత్వం సమ్మతించిందని చెప్పారు. అంతా అనుకున్నట్లు జరిగితే మూడు, నాలుగు నెలల్లో సంస్థ ప్రారంభమవుతుందన్నారు. దీని వల్ల విద్యార్థులతో పాటు పారిశ్రామికవేత్తలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

    ఈ సంస్థకు డెరైక్టర్‌ను కూడా నియమించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని ఆయన చెప్పారు. ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్‌ఆర్. పాటిల్ మాట్లాడుతూ బెంగళూరు ఇండియా నానోలో ప్రధానంగా శాస్త్రవేత్తలు, పెట్టుబడిదారులు పాల్గొంటారని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘గుజరాత్ నమూనా’ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, వాస్తవానికి తమ వద్ద  అంతకంటే నయమైన నమూనా ఉందని చెప్పారు. దేశంలోనే కర్ణాటక నానో టెక్నాలజీలో నాయకత్వ దశకు చేరుకుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నానో టెక్నాలజీలో తమతో పోటీ పడవచ్చని అన్నారు. ‘మా విధానాన్ని ప్రధాని అనుకరిస్తే మంచిది’ అని ఆయన చమత్కరించారు.
     

Advertisement
 
Advertisement
Advertisement