దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర మంత్రులకు అదేమీ పట్టినట్టు కనిపించడం లేదు.
ముంబై: దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ రాష్ట్ర మంత్రులకు అదేమీ పట్టినట్టు కనిపించడం లేదు. గడచిన మూడేళ్ల కాలంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు రూ. 6.28 కోట్లను విమానచార్జీల కింద ప్రభుత్వ నిధులను వెచ్చించారు. దీంతో నిరాడ ంబరంగా ఉండాలంటూ కేంద్రం వీరికి గౌరవపూర్వక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం సంగతి ఏవిధంగా ఉన్నా ఇదే సమయంలో ఖర్చులు తగ్గించుకోవాలంటూ యాధృచ్ఛికంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను ఆదేశించడం గమనార్హం. అనేక పర్యాయాలు విమానయానం మంత్రుల జాబితాలో పతంగ్రావ్ కదమ్ ఉన్నారు. గడచిన మూడు సంవత్సరాల కాలంలో పతంగ్రావ్ విమానబిల్లు రూ. 43 లక్షలు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పదవీబాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇప్పటిదాకా అయిన బిల్లు మొత్తం రూ. 6.32 లక్షలు.
ఇక ఉపముఖ్యమంత్రి అజిత్పవార్ బిల్లు 10.23, హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ బిల్లు రూ. 14.35, ఛగన్ భుజ్బల్ బిల్లు రూ. 18. రాజేంద్ర ములక్ రూ. 19.29, మాజీ ముఖ్యమంత్రి అశోక్చవాన్ బిల్లు రూ. 1.46 లక్షలు. ప్రముఖ సామాజిక కార్యకర్త అనిల్ గల్గాలి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేయగా పే అండ్ ఎకౌంట్స్ విభాగం ఈ వివరాలను అందజేసింది. ఇవన్నీ 2009, నవంబర్ నుంచి 2013, జనవరి మధ్యకాలంలో చేసిన విమాన ప్రయాణానికి సంబంధించిన ఖర్చుల వివరాలు.