
సాక్షి, బెంగళూరు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన తండ్రీ కుమార్తెలు మృత్యువాత పడ్డారు. బీదర్కు చెందిన టెక్కీ ముఖేశ్ శివాజీవార దేశ్ముఖ్ (27), ఆయన రెండేళ్ల కుమార్తె దివిజా రోడ్డు ప్రమాదంలో అసువులు బాసినట్లు ఇక్కడికి సమాచారం అందింది. బీదర్ జిల్లా భాల్కి తాలూకా కొంగళ్లికి చెందిన ముఖేశ్ అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఐటీ ఇంజనీర్గా పని చేస్తున్నారు. శుక్రవారం తన సతీమణి మౌనిక, కుమార్తె దివిజాలతో కారులో వెళుతున్నారు. ముఖేశ్ కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో కారు అదుపు తప్పి ఓ ట్రక్ను ఢీ కొట్టడంతో తండ్రీకుమార్తెలు ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా, మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చే విషయమై భారతీయ రాయబారి కార్యాలయంతో బీదర్ ఎంపీ భగవంత్ ఖోబా సంప్రదింపులు జరిపారు.