జయలలిత గెలుపుపై వేసిన పిటిషన్ విచారణను మద్రాస్ హైకోర్టు అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేసింది.
చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జయలలిత గెలుపు అక్రమం అంటూ దాఖలయిన పిటిషన్ విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేస్తూ మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. జయలలితకు ప్రత్యర్థిగా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రవీణ ఈ కేసు వేశారు. ఇందులో రాష్ట్ర అసెంబ్లీకి గత మే 16వ తేదీన ఎన్నికలు జరిగాయని, ఆర్కే నగర్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేశారని తెలిపారు.
ఈ నియోజకవర్గంలో ఆమె 39 వేలకు పైగా ఓట్ల మెజారీటీతో గెలుపొందినట్లు ప్రకటించారని వివరించారు. అయితే ఈ ఎన్నికల్లో ఓట్ల సేకరణకు అందరు అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. ముఖ్యంగా అధికారులు ముఖ్యమంత్రి జయలలితకు అనుకూలంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ కారణంగా జయలలిత గెలుపును రద్దు చేయాలన్నారు. న్యాయమూర్తి ఎం. దురైసామి సమక్షంలో విచారణ జరిగింది. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ అధికారులు, ముఖ్యమంత్రి జయలలిత తరఫున న్యాయవాదులు హాజరయ్యారు. దీనిపై రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు గడువు కోరారు. దీన్ని అంగీకరించిన న్యాయమూర్తి కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు.