కాటాన్ కొళత్తూరు పరిసరాల్లోని గ్రామీణ ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా ఎస్ఆర్ఎం మెడికల్ కళాశాల, ఆస్పత్రి బృహత్తర
ఎస్ఆర్ఎంలో ఆరోగ్య పథకం
కార్డు ధర రూ.100
రూ. 50 వేల వరకు చికిత్స ఉచితం
కాటాన్ కొళత్తూరు పరిసరాల్లోని గ్రామీణ ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా ఎస్ఆర్ఎం మెడికల్ కళాశాల, ఆస్పత్రి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎస్ఆర్ఎం కుటుంబ ఆరోగ్య సంక్షేమ పథకాన్ని ప్రకటించింది. రూ.వంద పెట్టి ఆరోగ్య కార్డు కొంటే రూ.50 వేల వరకు వైద్య సేవలు ఉచితంగా అందించనున్నారు.
సాక్షి, చెన్నై : కాటాన్ కొళత్తూరులోని ఎస్ఆర్ఎం వర్సిటీ ఆవరణలో ఎస్ఆర్ఎం జనరల్ ఆస్పత్రి నేతృత్వంలో పేద రోగులకు వైద్య సేవల్ని అందిస్తున్న విషయం తెలిసిం దే. అతి తక్కువ ఖర్చుతో పేదలకు ఖరీదైన వైద్యాన్ని ఆ వర్సిటీ అందిస్తోంది. తమ సేవల్ని విస్తృత పరిచే రీతిలో కుటుంబ ఆరోగ్య సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో మధ్యాహ్నం కుటుంబ ఆరోగ్య సంక్షేమ పథకం పరిచయ కార్యక్రమం జరిగింది. ముందస్తుగా పేర్లను నమోదు చేసుకున్న గ్రామీణ ప్రజలకు ఆరోగ్య సంక్షేమ పథకం కార్డులను ఆ వర్సిటీ అధ్యక్షుడు రవి పచ్చముత్తు అందజేశారు.
అనంతరం జరిగిన ఆవిర్భావోత్సవంలో రవి పచ్చముత్తు మాట్లాడుతూ, తమ వర్సిటీ పరిధిలోని 72 గ్రామాల ప్రజల ఆరోగ్య భద్రత లక్ష్యంగా తొలి విడతగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టామని ప్రకటించారు. ఆధునిక వైద్యం పేదలకు ఖరీదు అవుతుండడాన్ని పరిగణనలోకి తీసుకుని ఉన్నత వైద్యాన్ని గ్రామీణుల ముంగిటకు తీసుకు వచ్చేందుకు తమ ఛాన్సలర్ పచ్చముత్తు పారివేందర్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. తమ ఆస్పత్రిలో 1122 పడకలు ఉన్నాయని, అత్యాధునిక ైవె ద్య పరికరాలు, వైద్య నిపుణులు ఉన్నారని వివరించారు. ఈ పథకం కింద రూ.వంద చెల్లించి కుటుంబ కార్డును స్వీకరించే వారికి రూ.50 వేల వరకు వైద్య సేవలు ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు.
త్వరలో గ్రామీణ ప్రజల అత్యవసర వైద్య సేవలను పరిగణనలోకి తీసుకుని మొబైల్ వైద్య సేవలకు శ్రీకారం చుట్టనున్నామని ప్రకటించారు. ఆ వర్సిటీ వీసీ (మెడికల్) కే శ్రీధర్ ఆ పథకం గురించి వివరించారు. ఈ పథకంలో చేరే వాళ్ల కోసం స్వయంగా గ్రామాల్లోకి తమ సిబ్బంది వెళ్లడంతో పాటుగా తమ ఆస్పత్రి ఆవరణలో ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ పథకం కింద ఆస్పత్రిలో చేరే వారికి ఉచిత వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. అయితే, వైద్య పరికరాలు, మందులు, మాత్రల్ని మాత్రం ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని వివరించారు. సీటీ, ఎంఆర్ఐ స్కాన్లను 20 శాతం డిస్కౌంట్తో చేస్తామని, ఈ కార్డు కాల పరిమితి ఏడాదిగా పేర్కొన్నారు. తదుపరి మళ్లీ రెన్యూవల్ చేసుకోవాల్సిన వాళ్ల మరో మారు రూ.వంద చెల్లించాల్సి ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ వీసీ టీపీ గణేషన్, ప్రవీణ్ బక్ష్, ప్రొఫెసర్లు, డాక్టర్లు వినాయగం, ముస్తాక్ అహ్మద్, జేమ్స్ పాండియన్, గిరిష్, రాజు పాల్గొన్నారు.