హైదరాబాద్లోని సచివాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, ఉద్యోగ సంఘాలతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు సమావేశం నిర్వహించారు. అనంతరం కీలక వివరాలు వెల్లడయ్యాయి. రెండు రోజుల్లో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) ట్రస్ట్ ద్వారా ఇది అమలు అవుతుంది.
ఉద్యోగులు, పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యమని సీఎస్ రామకృష్ణరావు అన్నారు. ఉద్యోగ సంఘాల సూచనలతో ట్రస్ట్ మార్గదర్శకాలు రూపొందిస్తామని తెలిపారు. ట్రస్ట్కు ప్రత్యేక బ్యాంకు ఖాతా.. ప్రభుత్వం-ఉద్యోగుల సమాన వాటా ఉంటుందని వివరించారు. పూర్తి స్వయం ప్రతిపత్తితో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పనిచేయనుంది. లబ్ధిదారుల ప్రయోజనాల కోసం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ట్రస్ట్ పాలన, ఆర్థిక నిర్వహణపై ఉద్యోగ సంఘాల నుంచి కీలక సూచనలు వచ్చాయి.
ట్రస్ట్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం
జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ను స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రాథమిక వేతనంపై 1.5% కోత విధించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని కోరారు. ఉద్యోగి వాటాను బేసిక్ పేతో కాకుండా కుటుంబ సభ్యుల ఆధారంగా నిర్ణయించాలని చెప్పారు.


