ఇజ్రాయెల్‌ యుద్ధకాలపు సన్నద్ధత | Rambam Health Campus in Haifa operates a fortified underground hospital | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ యుద్ధకాలపు సన్నద్ధత

May 29 2026 2:07 AM | Updated on May 29 2026 2:07 AM

Rambam Health Campus in Haifa operates a fortified underground hospital

2వేల పడకలతో భూగర్భ ఆస్పత్రి

2006 లెబనాన్‌ యుద్ధ పాఠాలతో నిర్మాణం

హైఫా చారిత్రక నగరం. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారత సైనికుల సాయంతో విముక్తి పొందిన నగరం. ఇజ్రాయెల్‌లో మూడో అతిపెద్ద నగరం. ‘ఇజ్రాయెల్‌ శాన్‌ ఫ్రాన్సిస్కో’ అని కూడా పిలుస్తుంటారు. అంతేకాదు.. ఒకప్పుడు యూదులు, అరబ్బుల సహజీవనానికి ప్రతీక. మరి ఇప్పుడు ప్రస్తావించుకోవడానికి ప్రధాన కారణం.. ఈ నగరం వీధుల కింద నిశ్శబ్దంగా సేవలందిస్తున్న భూగర్భ ఆస్పత్రి. సైరన్ల మోతలు సర్వసాధారణమైపోయిన ప్రాంతంలో వేలాది మంది ప్రాణాలను కాపాడుతోంది. 

లెబనాన్‌ సరిహద్దుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైఫాలోని రాంబం హెల్త్‌ కేర్‌ క్యాంపస్‌లో ఈ భూగర్భ ఆస్పత్రి ఉంది. సాధారణ సమయాల్లో మూడంతస్తుల పార్కింగ్‌ స్థలంగా ఉండే ఈ నిర్మాణం అత్యవసర సమయాల్లో, 72 గంటల్లో 2వేల పడకల ఆస్పత్రిగా మారిపోతుంది. యుద్ధకాలం స్థైర్యానికి, అత్యవసర వైద్య సంసిద్ధతకు దీనిని ఏర్పాటు చేసింది. 

2006 లెబనాన్‌ యుద్ధంలో నేర్చుకున్న పాఠాలతో ఇజ్రాయెల్‌ నిర్మించిన ఈ ఆస్పత్రి అసాధారణ పరిస్థితుల్లో ఒక ప్రపంచ నమూనాగా మారింది. యుద్ధకాల ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను అధ్యయనం చేస్తున్న దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. నిరంతర క్షిపణి, డ్రోన్, రసాయన దాడులను సైతం తట్టుకునేలా నిర్మించారు. సముద్ర మట్టానికి దాదాపు తొమ్మిది మీటర్ల దిగువన ఉన్న ఈ హాస్పిటల్‌ ప్రపంచంలోనే ఏకైక భారీ భూగర్భ ఆసుపత్రి.  

నాలుగేళ్లలో.. రూ.1,154 కోట్లతో..
ఈ చారిత్రాత్మక ఆస్పత్రి నిర్మాణానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. దాదాపు 120 మిలియన్‌ డాలర్లు ఖర్చయింది. మూడంతస్తుల్లో ఉన్న ఈ భూగర్భ వైద్య సముదాయాన్ని యుద్ధ సమయంలో క్షిపణి దాడులను తట్టుకునేలా నిర్మించారు. ఒకేసారి 2,200 మంది రోగులకు చికిత్స అందిస్తుంది. మధ్యధరా సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఈ నరగంలో భూగర్భ నిర్మాణం ఒక పెద్ద ఇంజనీరింగ్‌ సవాలుగా నిలిచింది. దాదాపు 100 పంపులను ఉపయోగించి రెండేళ్ల పాటు ప్రతిరోజూ సముద్రపు నీటిని నిరంతరం బయటకు తోడేశారు. మళ్లీ నీరు చొరబడకుండా ఉండేందుకు ప్రత్యేక జలనిరోధక నిర్మాణ సామగ్రిని ఉపయోగించారు.

పదివేల మందికి పైగా...
ఇరాన్‌పై దాడి ప్రారంభించిన నాటి నుంచి ఈ ఆస్పత్రి దేశవ్యాప్తంగా క్షిపణి దాడుల్లో గాయపడిన పదివేల మందికిపైగా చికిత్స అందించింది. 144 మంది ఇజ్రాయెల్‌ సైనికులు చికిత్స పొందారు. ప్రస్తుతం సుమారు 14 మంది సైనికులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడులు తీవ్రమైన తరువాత కేవలం ఎనిమిది గంటల్లోనే దాదాపు 900 మంది రోగులను భూగర్భంలోకి తరలించి ఆసుపత్రి తన అత్యవసర సంసిద్ధతను ప్రదర్శించింది. ప్రధాన ఆస్పత్రి భవనంలోని రోగులను పటిష్టమైన ఈ నేలమాళిగకు వేగంగా తరలించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా అక్కడ వైద్య బృందాలు చికిత్సను పునఃప్రారంభించాయి. వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బంది.. ప్రతి ఒక్కరికీ యుద్ధకాలపు బాధ్యతలు కేటాయించారు. 

డేకేర్‌ సెంటర్‌ కూడా...
ఆస్పత్రిలో ప్రస్తుతం 6,500 మంది నర్సులు, 2,000 మంది వైద్యులు పనిచేస్తున్నారు. క్షిపణి దాడుల సమయంలో వీరు తమ చికిత్సను కొనసాగిస్తారు. సంఘర్షణలు ఎక్కువ కాలం కొనసాగినా.. వైద్యులు, నర్సులు, సంరక్షకులు పిల్లల సంరక్షణ గురించి ఆందోళన చెందకుండా ఉండేందుకు ఇక్కడ ప్రసూతి విభాగం, మూడు నెలల నుంచి 12 ఏళ్ల వయసున్న 70 మంది పిల్లలుండేలా పూర్తిస్థాయి డేకేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇటీవల దాడులు తీవ్రంగా ఉన్న సమయంలో వీరు దాదాపు నెలన్నర పాటు అజ్ఞాతంలోనే ఉండి వైద్య సేవలు అందించాల్సి వచ్చింది. 

మూడు రోజులైనా..
ఆసుపత్రిలో ఆహారం, పెట్రోల్, ఆక్సిజన్, వైద్య సామాగ్రి కూడా ఉన్నాయి. వీటితో మూడు రోజుల పాటు స్వయం సమృద్ధిగా ఉండగలదు. కరోనావైరస్‌ సంక్షోభ సమయంలో ఈ ఆసుపత్రిని వినియోగించారు. గుహలాంటి విశాలమైన ప్రదేశంలో రోగులకు చికిత్స చేయడంలో ఉన్న ఇబ్బందులను సిబ్బంది అప్పుడు తెలుసుకున్నారు. క్లాస్ట్రోఫోబియా (ఇరుకు ప్రదేశాలంటే భయం) ఉన్నవారి అసౌకర్యాన్ని తగ్గించాలని గోడలను పూల పోస్టర్లతో అలంకరించారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement