మహిళా విలేకరిపై వేధింపులు | Harassment of a female reporter in mumbai | Sakshi
Sakshi News home page

మహిళా విలేకరిపై వేధింపులు

Aug 18 2017 8:44 PM | Updated on Sep 12 2017 12:25 AM

అర్ధరాత్రి సమయంలో వెళ్తున్న మహిళా విలేకరిని ఇద్దరు వ్యక్తులు వెంబడించి వేధించారు.

ముంబై : అర్ధరాత్రి సమయంలో వెళ్తున్న మహిళా విలేకరిని ఇద్దరు వ్యక్తులు వెంబడించి వేధించారు. ఈ విషయంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిగంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. ముంబైలోని అంథేరి ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.  ఓ వార్తా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని  అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆటోలో తన ఇంటికి వెళుతోంది.

అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై ఆమెను వెంబడించి వెకిలి మాటలు మాట్లాడసాగారు. ఇరవై నిమిషలపాటు ఆమె వారి వేధింపులను భరించింది. చివరికి పోలీసు జీపు అటుగా రావటంతో ఆ దుండగులు పరారయ్యారు. అయితే బాధితురాలు పోలీసులకు ఈ విషయం వివరించింది. తన ఫోన్‌లో తీసిన దుండగుల ఫొటోలను, రికార్డు చేసిన మాటలతోపాటు స్కూటీ నంబర్‌ ఫొటోను అందజేసింది. అనంతరం పోలీసులు ఆమెను సురక్షితంగా ఇంటికి పంపారు. బాధితురాలు ఇచ్చిన ఆధారాలతో నిందితులను క్లిఫర్డ్‌ అమన(25)అనే ఐటీ ఉద్యోగి, సాగర్‌ సింగ్(21)అనే బీకాం విద్యార్థిగా గుర్తించి అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement