పూర్తిస్థాయిలో.. | Ch Vidyasagar Rao as Governor of Tamil Nadu fully | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయిలో..

Jul 25 2017 2:48 AM | Updated on Jul 29 2019 6:58 PM

పూర్తిస్థాయిలో.. - Sakshi

పూర్తిస్థాయిలో..

తమిళనాడుకు పూర్తిస్థాయిలో గవర్నర్‌గా సీహెచ్‌ విద్యాసాగర్‌ రావును నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

విద్యాసాగర్‌ రావుకే బాధ్యత?
కేంద్రంలో చర్చ

సాక్షి, చెన్నై :

తమిళనాడుకు పూర్తిస్థాయిలో గవర్నర్‌గా  సీహెచ్‌ విద్యాసాగర్‌ రావును నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్‌చార్జ్‌ గవర్నర్‌గా తమిళనాడు మీద ఆయన పట్టు సాధించిన దృష్ట్యా, పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు తగ్గ  కసరత్తుల్లో కేంద్రం ఉన్నట్టు సమాచారం. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణానంతరం  ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో సీనియర్‌ నేతగా ఉన్న కొణిజేటి రోశయ్య అనూహ్యంగా సీఎం పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.

తదనంతరం పరిణామాలతో రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆయన రాకతో  తమిళనాట ఉన్న తెలుగు వారికి రాజ్‌భవన్‌ ప్రవేశం ఎంతో సులభతరం అయిందని చెప్పవచ్చు. తెలుగువారు పిలిస్తే పలికే గవర్నర్‌గా ఆయన మన్ననల్ని అందుకున్నారు. కేంద్రంలో అధికారం మారినా రోశయ్య మాత్రం గవర్నర్‌గానే కొనసాగారు. తమిళనాడు ప్రభుత్వంతో ఆయన ఎంతో సన్నిహితంగా మెలగడం కలిసి వచ్చిన అంశం. ఐదేళ్లపాటు రాష్ట్ర గవర్నర్‌గా పనిచేసిన కొణిజేటి రోశయ్య పదవీ కాలం గత ఏడాది ఆగస్టులో ముగిసింది. తదుపరి రాష్ట్రానికి పూర్తిస్థాయిలో గవర్నర్‌ను కేంద్రం నియమించలేదు.

అయితే, తెలుగువారైన సీహెచ్‌ విద్యా సాగర్‌ రావుకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించింది. మహారాష్ట్ర గవర్నర్‌గా, తమిళనాడు ఇన్‌చార్జ్‌ గవర్నర్‌గా విద్యాసాగర్‌ రావు కీలక పాత్ర పోషించారు. అమ్మ జయలలిత ఆస్పత్రిలో ఉన్నప్పుడు గానీయండి, మరణం తదుపరి పరిణామాలతో గానీయండి ఇన్‌చార్జ్‌ గవర్నర్‌గా ఆయన పాత్ర ప్రశంసనీయం. వారంలో రెండురోజులు చెన్నైలో ఉండే విధంగా, అవసరాన్ని బట్టి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో జరిగే వేడుకల్లో ఇన్‌చార్జ్‌గా విద్యాసాగర్‌ రావు హాజరవుతూ వచ్చారు. తమిళనాడు మీద ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయిలో పట్టు సాధించారని చెప్పవచ్చు. అందుకే కాబోలు ఆయన్ను పూర్తిస్థాయి గవర్నర్‌గా నియమించేందుకు కేంద్రం కసరత్తులు చేపట్టినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.

తెలుగువారికి దగ్గరయ్యే అవకాశం
ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర సహాయ మంత్రిగా గతంలో పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న విద్యా సాగర్‌ రావుకు తమిళనాడు బాధ్యతల్ని పూర్తిస్థాయిలో అప్పగించేందుకు కేంద్రం కసరత్తుల్లో ఉన్న సమాచారం ఇక్కడి తెలుగు వారికి ఆనందమే. రోశయ్య ఇదివరకు తెలుగు వారికి పెద్ద దిక్కుగా ఇక్కడ మెలిగారని చెప్పవచ్చు.

తెలుగింటి కార్యక్రమాలకు పిలిచిన తక్షణం ఆయన హాజరయ్యేవారు. ప్రస్తుతం ఇన్‌చార్జ్‌ గవర్నర్‌గా ఉన్న విద్యాసాగర్‌ రావు తరచూ తెలుగు వారికి రాజ్‌ భవన్‌ అపాయింట్‌మెంట్లను ఇస్తూనే ఉన్నారు. ఆయన పూర్తిస్థాయిలో ఇక్కడ బాధ్యతలు చేపట్టిన పక్షంలో తెలుగువారికి మరింత దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అన్నాడీఎంకే  ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో ఉంచుకునే సమర్థుడిగా విద్యాసాగర్‌ రావు అవతరించే అవకాశాలు ఎక్కువే. అయితే, ఆయనే పూర్తిస్థాయి గవర్నర్‌ అన్న చర్చ ఊపందుకున్నా, అధికారిక ప్రకటన కోసం ఉప రాష్ట్రపతి ఎన్నికల తదుపరి జరిగే మంత్రివర్గ విస్తరణ వరకు వేచి ఉండాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement