నగర మహిళకు భద్రతా భావం కలగాలంటే పరిపాలనా అనుభవం కలిగిన మహిళా ముఖ్యమంత్రి అవసరమని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: నగర మహిళకు భద్రతా భావం కలగాలంటే పరిపాలనా అనుభవం కలిగిన మహిళా ముఖ్యమంత్రి అవసరమని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి పేర్కొన్నారు. తమ పార్టీ అధిష్టానం సీఎం అభ్యర్థిగా బరిలోకి దింపిన మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్బేడీకి ఓటు వేయాలని ఆమె ఓటర్లకు విజ్ఞప్తిచేశారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వస్తే చేయాల్సిన పనులకు సంబంధించి తమ పార్టీ అనేక ప్రణాళికలను రూపొందించిందన్నారు. ‘నగరంలో నివసిస్తున్న మహిళల సమస్యలను బాగా అర్థం చేసుకోవాలంటే పరిపాలనా అనుభవం కలిగిన మహిళా ముఖ్యమంత్రి అవసరం. మహిళా భద్రతకు సంబంధించి మా వద్ద అనేక ప్రణాళికలు సిద ్ధంగా ఉన్నాయి. అయితే అధికారంలోకి వస్తే మాత్రమే వాటిని అమలు చేయగలుగుతాం’ అని మీనాక్షి పేర్కొన్నారు. విధానసభ ఎన్నికల్లో విజయం సాధిస్తే మహిళల సౌకర్యం కోసం అనేకం అందుబాటులోకి తీసుకొస్తామని మీనాక్షి చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్, మహిళా ట్యాక్సీలను వంటివి ప్రవేశపెడతామన్నారు.