ప్రిక్వార్టర్స్‌లో రుత్విక ఓటమి | world junnor badmiton championship Ruthvika lost the game in pre-quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో రుత్విక ఓటమి

Nov 1 2013 12:17 AM | Updated on Jul 12 2019 6:04 PM

ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ కథ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది.

బ్యాంకాక్ (థాయ్‌లాండ్): ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ కథ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రుత్విక శివాని ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 10-21, 15-21తో జపాన్‌కు చెందిన అకెన్ యమగుచి చేతిలో పరాజయం చవిచూసింది. అంతకుముందు మూడో రౌండ్ పోరులో ఆమె 21-16, 18-21, 21-13తో మరియా మిత్సోవా (బల్గేరియా)పై విజయం సాధించింది. తొలి గేమ్‌లో కాస్త పోటీనిచ్చిన ప్రత్యర్థి రెండో గేమ్‌లో విజృంభించి గేమ్‌ను చేజిక్కించుకుంది. తిరిగి నిర్ణాయక మూడో గేమ్‌లో ఏపీ అమ్మాయి పుంజుకొని మిత్సోవాను కంగుతినిపించింది.
 
 రుత్విక నెట్ వద్ద 4 పాయింట్లు, స్మాష్‌లతో 8 పాయింట్లు సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్ మూడో రౌండ్ పోటీల్లో మేఘన-సాన్యామ్ శుక్లా జంట 13-21, 10-21తో హే రిన్ కిమ్-జంగ్ హో కిమ్ (దక్షిణకొరియా) జోడి చేతిలో, సంతోష్ రావూరి-పూర్వీషా రామ్ జోడి 11-21, 13-21తో ఫేబియాన్ రోత్-జెన్నిఫర్ కార్నోట్ (జర్మనీ) జంట చేతిలో పరాజయం చవిచూశాయి. మహిళల సింగిల్స్‌లో రితూపర్ణ దాస్, పురుషుల సింగిల్స్‌లో ఆదిత్య జోషి, అరుణ్ జార్జ్‌లు కూడా ఇంటిదారి పట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement