విరాట్‌ కోహ్లి మరో ఘనత | Virat Kohli gets Another Feat | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి మరో ఘనత

Jan 7 2019 2:24 PM | Updated on Jan 7 2019 2:24 PM

Virat Kohli gets Another Feat - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాతో వారి దేశంలో జరిగిన టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో భారత్‌ తరపున ఆ ఘనత సాధించిన తొలి కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన విరాట్‌ కోహ్లి.. మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా కూడా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియాలో సిరీస్‌ సాధించిన విదేశీ జట్ల జాబితాలో ఇప్పటివరకూ ఏ ఒక్క ఆసియా జట్టు కూడా లేదు. అంతకుముందు ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికాలు మాత్రమే ఆసీస్‌ను వారి గడ్డపై ఓడించి సిరీస్‌ సాధించిన జట్లు. ఇందులో ఇంగ్లండ్‌ 13 సార్లు సిరీస్‌ సాధించగా, విండీస్‌ నాలుగు సందర్భాల్లో సిరీస్‌లు సాధించింది. ఇక దక్షిణాఫ్రికా మూడు సార్లు, న్యూజిలాండ్‌లు ఒకసారి ఆసీస్‌ను వారి దేశంలో సిరీస్‌ సాధించిన జట్లు.

మరొకవైపు కెప్టెన్‌గా కోహ్లికి విదేశాల్లో నాల్గో సిరీస్‌ విజయం. 2015లో శ్రీలంకలో 2-1తో సిరీస్‌ గెలిచిన విరాట్‌ సేన.. 2016లొ వెస్టిండీస్‌లో 2-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. 2017లో మరొకసారి శ్రీలంకపై సిరీస్‌ను కైవసం చేసుకుంది కోహ్లి అండ్‌ గ్యాంగ్‌. ఆ సిరీస్‌ను భారత్‌ 3-0తో సాధించింది. ఆపై ఆసీస్‌ను వారి గడ్డపైనే ఓడించి సిరీస్‌ను సాధించడంతో కోహ్లి నేతృత్వంలోని టీమిండియా కొత్త అధ్యాయాన్ని లిఖించింది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 31 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో 146 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి పాలైంది. ఆపై మెల్‌ బోర్న్‌ టెస్ట్‌లో 137 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది.  చివరి టెస్టు డ్రా ముగియడంతో సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో చతేశ్వర్‌ పుజారా 521 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, బౌలింగ్‌ విభాగంలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మహ్మద్‌ షమీ 16 వికెట్లు, ఇషాంత్‌ శర్మ 11 వికెట్లు తీశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement