చరిత్రకు చేరువలో... | Today is the third ODI in Cape Town | Sakshi
Sakshi News home page

చరిత్రకు చేరువలో...

Feb 7 2018 1:19 AM | Updated on Feb 7 2018 3:59 AM

Today is the third ODI in Cape Town - Sakshi

టీమిండియా

బలాబలాల్లో ఎంత మార్పు...? టెస్టు సిరీస్‌కు ముందు దుర్భేద్యంగా దక్షిణాఫ్రికా! తొలి టెస్టు ముగియకుండానే స్టెయిన్‌ అవుట్‌! వన్డే సిరీస్‌ మొదటి మూడు మ్యాచ్‌లకు డివిలియర్స్‌ దూరం! రెండో మ్యాచ్‌ వచ్చేసరికి కెప్టెన్‌ డు ప్లెసిస్‌ అందుబాటులో లేడు! మూడో మ్యాచ్‌ సమయానికి కీపర్‌ డికాక్‌ సేవలూ కరవు! ఇప్పుడిక మొగ్గంతా భారత్‌ వైపే! చర్చంతా చహల్, కుల్దీప్‌ మణికట్టు మాయాజాలంపైనే! గతంలో దక్షిణాఫ్రికా గడ్డపై ఆడిన నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌ ఏనాడూ వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలుపొందలేదు. సిరీస్‌నూ సొంతం చేసుకోలేదు. ఈసారి మాత్రం టీమిండియా ‘హ్యాట్రిక్‌’ విజయంపై దృష్టి పెట్టింది. మూడో మ్యాచ్‌లోనూ భారత్‌ గెలిస్తే తొలిసారి సిరీస్‌ కోల్పోకుండా ఉంటుంది. దాంతోపాటు సఫారీలను వారి సొంతగడ్డపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడించిన ఘనత సాధిస్తుంది.

కేప్‌టౌన్‌: ప్రత్యర్థిని స్పిన్నర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. టాపార్డర్‌ నిలకడగా ఆడుతోంది. మిగతా బ్యాట్స్‌మెన్‌ తమ వంతుకు ఎదురుచూస్తున్నారు. 2–0 ఆధిక్యంతో సిరీస్‌లో ముందంజ వేసిన ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియా బుధవారం కేప్‌టౌన్‌లో సఫారీలతో మూడో వన్డేకు సిద్ధమైంది. మరోవైపు మ్యాచ్‌కొకరు చొప్పున కీలక ఆటగాళ్లు దూరమవుతున్న పరిస్థితుల్లో, మిగిలిన వారి వైఫల్యాలతో దక్షిణాఫ్రికా సతమతమవుతోంది. ఓటములతో పాటు గాయాలతో కుదేలైన జట్టును అనుభవం లేని మార్క్‌రమ్‌ నడిపించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సొంత గడ్డపై భారత్‌కు తొలిసారి వన్డే సిరీస్‌ను కోల్పోకుండా ఉండాలంటే కేప్‌టౌన్‌లో ఆతిథ్య జట్టు అసాధారణంగా ఆడాల్సిందే. 

దూకుడు మీద టీమిండియా... 
టెస్టు సిరీస్‌లోలా వన్డేల్లో టీమిండియాకు తుది జట్టు ఎంపిక సమస్యల్లేవు. రెండు మ్యాచ్‌ల్లోనూ ముగ్గురు, నలుగురు ఆటగాళ్లే అంతా చూసుకున్నారు. దీంతో మార్పులకు ఏమాత్రం అవకాశం లేనట్లే. సెంచూరియన్‌లో ఆడిన 11 మందితోనే బరిలో దిగడం ఖాయం. ఈ ఒక్కటీ గెలిస్తే 3–0తో నిలిచి ఆరు వన్డేల సిరీస్‌ను చేజారకుండా చూసుకోవచ్చు. కాబట్టి కోహ్లి సేన కోణంలోనూ మూడో వన్డే కీలకమే. స్పిన్నర్లు చహల్, కుల్దీప్‌లను ఎదుర్కోవడం ప్రత్యర్థికి తలకుమించిన భారం అవుతోంది. పేసర్లు బుమ్రా, భువనేశ్వర్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో స్పెషలిస్టులు. టాపార్డర్‌ బ్యాటింగ్‌లో ధావన్, కెప్టెన్‌ కోహ్లి, రహానే ఫామ్‌ చాటుకున్నారు. మిగిలింది రోహిత్‌ శర్మ ఒక్కడే. తనదైన రోజున అతడిని ఆపడం ఎవరి తరం కాదు. జాదవ్, ధోని, పాండ్యా క్రీజులో దిగాల్సిన అవసరమే రాలేదు. ఏ విధంగా చూసినా మన జట్టులో లోపాలు కనిపించడం లేదు. అయితే... 1992–93, 2010–11 సీజన్లలోనూ ఇదే విధంగా ఆధిక్యంలో ఉండీ భారత్‌ సిరీస్‌లు కోల్పోయింది. ఈసారి అలాంటి నిర్లిప్తతకు తావివ్వకుండా ఆడితే వరుసగా మూడో విజయం ఖాయం. తర్వాతి మూడింటిలో ఒక్కదాంట్లో గెలిచినా సఫారీ గడ్డపై తొలి వన్డే సిరీస్‌ను చేజిక్కించుకున్న జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. 

సఫారీలకు సవాలే! 
‘డి’ త్రయం డివిలియర్స్, డు ప్లెసిస్, డికాక్‌ దూరం కావడంతో దక్షిణాఫ్రికా ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. సీనియర్ల గాయాలతో మిడిలార్డర్‌ లయ దెబ్బతిన్నదని భావిస్తుండగా డి కాక్‌ గైర్హాజరీలో ముఖ్యమైన ఓపెనింగ్‌ స్థానంలోనూ లోటు కనిపిస్తోంది. ఆమ్లాతో కలిసి కెప్టెన్‌ మార్క్‌రమ్‌ గాని, వన్డే అరంగేట్రం చేయనున్న కీపర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ గాని ఇన్నింగ్స్‌ ఆరంభిస్తారు. గత మ్యాచ్‌లో ఆడిన జొండొ స్థానంలో సీనియర్‌ బెహర్దీన్‌ను తీసుకోవచ్చని భావిస్తున్నారు. వీరిద్దరినీ కొనసాగించాలనుకుంటే  మాత్రం డేవిడ్‌ మిల్లర్‌ను పక్కన పెట్టాల్సిందే. తమ జట్టులో ఇద్దరు స్పిన్నర్లకు చోటు కష్టమని తొలి వన్డే సందర్భంగా డు ప్లెసిస్‌ చెప్పినా... మార్క్‌రమ్‌ మాత్రం రెండో వన్డేకు తాహిర్, షమ్సీలను తీసుకున్నాడు. ఈసారీ వారికి అవకాశం ఉండొచ్చు. కానీ, భారత స్పిన్నర్లలా ఈ ఇద్దరు పిచ్‌ను అర్థం చేసుకుని బంతులు వేయలేకపోతున్నారు. పేసర్లు మోర్కెల్, రబడ తమ పదును చూపకపోవడంతో బ్యాట్స్‌మెన్‌ తేలిగ్గా ఆడేస్తున్నారు. ఏదేమైనా జట్టు సమష్టిగా ఆడితేనే గెలుపును ఊహించుకునే అవకాశం ఉంటుంది.

పిచ్, వాతావరణం 
కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ బ్యాటింగ్‌కు స్వర్గధామం. గత ఆరు వన్డేల మొదటి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 311 కావడమే దీనికి నిదర్శనం. ఇక్కడి వాతావరణం 30 డిగ్రీలుగా ఉంది. బుధవారం కూడా ఇదే తీరుగా ఉండనుంది.  
 
జట్లు (అంచనా) 
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్, రోహిత్, రహానే, జాదవ్, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా. 
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), ఆమ్లా, డుమిని, బెహర్దీన్, మిల్లర్‌/జొండొ, క్లాసెన్, మోరిస్, మోర్కెల్, రబడ, తాహీర్, షమ్సీ.

►ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న టీమిండియా ఈ మ్యాచ్‌లో ఓడితే రెండో స్థానానికి పడిపోతుంది. దక్షిణాఫ్రికా మొదటి స్థానానికి ఎగబాకుతుంది. భారత్‌ గెలిస్తే టాప్‌ ర్యాంక్‌ మరింత పదిలం అవుతుంది.

► సాయంత్రం 4.30 నుంచి సోనీ టెన్‌–1లో ప్రత్యక్ష ప్రసారం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement