మరో 265 పరుగులు.. ఒక రోజంతా సమ యం... చేతిలో పది వికెట్లు... తమ తొలి రంజీ టైటిల్ను అందుకునేందుకు గుజరాత్
ప్రస్తుతం 47/0
ముంబైతో రంజీ ఫైనల్
ఇండోర్: మరో 265 పరుగులు.. ఒక రోజంతా సమ యం... చేతిలో పది వికెట్లు... తమ తొలి రంజీ టైటిల్ను అందుకునేందుకు గుజరాత్ ముందున్న లక్ష్యం ఇది. రంజీ ట్రోఫీ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై జట్టు గుజరాత్ ముందు 312 పరుగుల లక్ష్యా న్ని ఉంచింది. నాలుగో రోజు శుక్రవారం ఆట ముగి సే సమయానికి 13.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా పార్థీవ్ సేన 47 పరుగులు చేసింది. క్రీజులో సూపర్ ఓపెనింగ్ జోడి ప్రియాంక్ పాంచల్ (34 బ్యాటింగ్; 7 ఫోర్లు), గోహెల్ (8 బ్యాటింగ్) ఉన్నారు.
ఒకవేళ రోజంతా క్రీజులో నిలిచి మ్యాచ్ను డ్రాగా ముగించినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా గుజరాత్ చాంపియన్గా నిలిచే అవకాశం ఉంటుంది. అయితే గెలుపు కోసం దూకుడుగా ఆడతారా.. లేక రక్షణాత్మక ఆటతీరుకు కట్టుబడతారా అనేది వేచిచూడాలి. అంతకుముందు ముంబై జట్టు తమ రెండో ఇన్నింగ్స్ను 137.1 ఓవర్లలో 411 పరుగుల వద్ద ముగించింది. సీనియర్ ఆల్రౌండర్ అభిషేక్ నాయర్ (91; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) తన విలువైన ఆటతో జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. కెప్టెన్ ఆదిత్య తారే (69; 12 ఫోర్లు) సహకరించాడు. చింతన్ గజాకు ఆరు వికెట్లు, ఆర్పీ సింగ్కు రెండు వికెట్లు దక్కాయి.