స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణాధికారిగా వివేక్ | supreme court | Sakshi
Sakshi News home page

స్పాట్ ఫిక్సింగ్ కేసు విచారణాధికారిగా వివేక్

Apr 18 2015 1:39 AM | Updated on Sep 2 2018 5:18 PM

ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసును విచారించేందుకు సీబీఐ అధికారి వివేక్ ప్రియదర్శిని సుప్రీంకోర్టు కొత్తగా నియమించింది.

సుప్రీంకోర్టు నియామకం
 న్యూఢిల్లీ: ఐపీఎల్-6 స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసును విచారించేందుకు సీబీఐ అధికారి వివేక్ ప్రియదర్శిని సుప్రీంకోర్టు కొత్తగా నియమించింది. ప్రస్తుతం ఆయన అవినీతి నిరోధక సెల్‌లో సూపరిండెంట్‌గా పని చేస్తున్నారు. ఇంతకుముందు విచారణాధికారిగా ఉన్న బీబీ మిశ్రా రిటైర్ కావడంతో ఆయన స్థానంలో వివేక్ బాధ్యతలు చేపట్టనున్నారు.
 
 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల స్కామ్ కేసును వివేక్ సమర్థంగా నిర్వహించడంతో జస్టిస్ ఆర్.ఎమ్. లోథా కమిటీ కోరిక మేరకు సుప్రీం కోర్టు ఈ నియామకాన్ని చేపట్టింది. స్పాట్ ఫిక్సింగ్‌లో ఐపీఎల్ సీఓఓ సుందర్ రామన్ పాత్రపై వివేక్ విచారణ జరపనున్నారు.
 
  ఈ విచారణ కోసం సరైన టీమ్‌ను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ సీబీఐ అధికారికి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే బీబీ మిశ్రా టీమ్‌కు ఉన్న అధికారాలన్ని వివేక్ బృందానికి ఉంటాయని స్పష్టం చేసింది. విచారణ చేయడం, సోదాలు నిర్వహించడం, అవసరమైన డాక్యుమెంట్లను సీజ్ చేయడం కూడా ఈ టీమ్ చేయొచ్చని తెలిపింది. ఈ మొత్తం టాస్క్‌లో వివేక్ టీమ్ సేవలు లోథా కమిటీకి కూడా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌కు శిక్ష ఖరారు చేయడం కోసం సుప్రీంకోర్టు...జస్టిస్ లోథా అధ్యక్షతన జస్టిస్ అశోక్ భాను, ఆర్.వి. రాఘవేంద్రలతో కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement