
కాన్బెర్రా: శ్రీలంక బ్యాట్స్మన్ దిముత్ కరుణరత్నేకు బంతి బలంగా తగలడంతో ఫీల్డ్లోనే కుప్పకూలిపోయాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్ చేసే క్రమంలో ఓపెనర్ కరుణరత్నే ఓ బౌన్సర్కు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ వేసిన 31 ఓవర్లో నాల్గో బంతి వేగంగా కరుణరత్నేపైకి వచ్చింది. సుమారు 143 కి.మీ వేగంతో వచ్చిన బంతిని తప్పించుకునే ప్రయత్నంలో కరుణరత్నే విఫలమయ్యాడు. అది మెడ వెనుక భాగాన బలంగా తగలడంతో కరుణరత్నే విలవిల్లాడుతూ గ్రౌండ్లోనే చతికిలబడిపోయాడు.
మెడికల్ స్టాప్ హుటాహుటీనా గ్రౌండ్లోకి వచ్చి కరుణరత్నేకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం అతన్ని స్ట్రెచర్పైనే మైదానం నుంచి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కాన్బెర్రా ఆస్పత్రిలో కరుణరత్నేకు చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంక స్కోరు 82 పరుగుల వద్ద ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో కరుణరత్నే 46 పరుగులు చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 534 పరుగులు చేసి డిక్లేర్ చేసింది.