‘రాకెట్’ వేగం.. ‘బాణం’ పదును | Saurav Ghosal: Indian squash player’s road to final in Asian Games 2014 | Sakshi
Sakshi News home page

‘రాకెట్’ వేగం.. ‘బాణం’ పదును

Sep 26 2014 12:31 AM | Updated on Sep 2 2017 1:57 PM

‘రాకెట్’ వేగం.. ‘బాణం’ పదును

‘రాకెట్’ వేగం.. ‘బాణం’ పదును

ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ క్రీడాకారులు రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంటే... ఆర్చరీలో బాణం పదును పెరిగింది.

* స్క్వాష్‌లో రెండు పతకాలు ఖాయం  
* ఆర్చరీలో కనీసం రజతం వచ్చినట్లే
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత స్క్వాష్ క్రీడాకారులు రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంటే... ఆర్చరీలో బాణం పదును పెరిగింది. టీమ్ విభాగంలో సెమీస్‌కు చేరిన స్క్వాష్ బృందం కనీసం రెండు కాంస్యాలను ఖాయం చేసుకోగా... కాంపౌండ్ విభాగంలో ఫైనల్‌కు చేరిన విలుకాండ్లకు కనీసం రజతం దక్కనుంది. మహిళల స్క్వాష్ పూల్-బి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో చైనాపై నెగ్గింది. దీంతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి సెమీస్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సెమీస్‌లో భారత్ మహిళల జట్టు... దక్షిణ కొరియాతో అమీతుమీ తేల్చుకుంటుంది. పురుషుల గ్రూప్-బిలో భారత్ 1-2తో మలేసియా చేతిలో ఓడటంతో గ్రూప్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-0తో జపాన్‌పై నెగ్గింది. సెమీస్‌లో భారత్... కువైట్‌తో తలపడుతుంది.
 
అదిరిన గురి
పురుషుల ఆర్చరీ టీమ్ కాంపౌండ్‌లో అభిషేక్ వర్మ, రజత్ చౌహన్, సందీప్ కుమార్‌ల త్రయం ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లో భారత బృందం 231-227తో ఇరాన్‌పై గెలిచింది. అంతకుముందు జరిగిన క్వార్టర్స్‌లో 234-229తో మలేసియాపై.. ప్రిక్వార్టర్స్‌లో భారత్ 233-218తో ఖతార్‌పై నెగ్గింది. వ్యక్తిగత విభాగం క్వార్టర్‌ఫైనల్లో అభిషేక్ వర్మ 147-142తో చోయ్ యంగ్‌హీ (కొరియా)పై గెలిచి సెమీస్‌కు చేరాడు. సందీప్ 135-141తో డెలా క్రూయిజ్ (ఫిలిప్పిన్స్) చేతిలో ఓడాడు. మహిళల టీమ్ కాంపౌండ్ సెమీస్‌లో త్రిష, పూర్వాషా షిండే, జ్యోతి సురేఖ బృందం 224-226తో చైనీస్‌తైపీ చేతిలో ఓడింది. వ్యక్తిగత విభాగం క్వార్టర్స్‌లో త్రిష 142-131తో షబ్నమ్ (ఇరాన్)పై గెలిచి సెమీస్‌లోకి ప్రవేశించగా, పూర్వాషా 140-143తో సీకో జిహుయాన్ (కొరియా) చేతిలో పరాజయం చవిచూసింది.

Advertisement
 
Advertisement
Advertisement