కశ్యప్‌ ఆట ముగిసింది... | Satwik-Ponnappa in main draw of Denmark Open, Kashyap out | Sakshi
Sakshi News home page

కశ్యప్‌ ఆట ముగిసింది...

Oct 18 2017 12:32 AM | Updated on Oct 18 2017 12:32 AM

Satwik-Ponnappa in main draw of Denmark Open, Kashyap out

ఒడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో పారుపల్లి కశ్యప్‌ క్వాలిఫయింగ్‌లోనే ఇంటిదారి పట్టాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని పొన్నప్ప జోడి ప్రధాన డ్రాకు అర్హత సంపాదించింది. ఆడిన రెండు క్వాలిఫయింగ్‌ పోటీల్లోనూ ఈ జంట గెలుపొందింది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో కశ్యప్‌ తొలి రౌండ్‌లో 21–13, 21–16తో విక్టర్‌ స్వెండ్సెన్‌ (డెన్మార్క్‌)పై విజయం సాధించాడు.

తర్వాత జరిగిన రెండో రౌండ్లో కశ్యప్‌ 4–21, 19–21తో జపాన్‌కు చెందిన తకుమా వుయేడా చేతిలో పరాజయం చవిచూశాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి మ్యాచ్‌లో రాంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌–అశ్విని జంట 21–17, 21–13తో క్రిస్టోఫర్‌ నుడ్సెన్‌–ఇసాబెలా నీల్సన్‌ (డెన్మార్క్‌) జోడీపై గెలిచింది. అనంతరం జరిగిన రెండో రౌండ్లోనూ ఈ భారత జోడి 21–8, 21–13తో జోన్స్‌ రాల్ఫీ జన్సెన్‌–ఎవా జన్సెన్స్‌ (జర్మనీ) జంటపై నెగ్గింది.  మిక్స్‌డ్‌ డబుల్స్‌ మెయిన్‌ డ్రా తొలి రౌండ్‌లో ప్రణవ్‌ చోప్రా–సిక్కిరెడ్డి జంట 17–21, 15–21తో సామ్‌ మాగి–క్లొ మాగి(ఐర్లాండ్‌) జోడి చేతిలో ఓడింది.

Advertisement
 
Advertisement
Advertisement