రెండో రౌండ్‌లో సైనా, శ్రీకాంత్‌

Saina Nehwal K Srikanth and P Kashyap progress to second round - Sakshi

మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ

కౌలాలంపూర్‌ (మలేసియా): కొత్త ఏడాదిలో తొలి టైటిల్‌ సాధించడమే లక్ష్యంగా... మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ బరిలోకి దిగిన భారత స్టార్‌ ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్‌ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఏడో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌ 21–17, 21–11తో లాంగ్‌ ఆంగస్‌ (హాంకాంత్‌)పై 30 నిమిషాల్లోనే విజయం సాధించాడు. మరో మ్యాచ్‌లో క్వాలిఫయర్‌ పారుపల్లి కశ్యప్‌ (భారత్‌) 19–21, 21–19, 21–10తో రస్‌మస్‌ జెమ్‌కీ (డెన్మార్క్‌)పై నెగ్గి ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఏడో సీడ్‌ సైనా నెహ్వాల్‌ 14–21, 21–18, 21–18తో డెంగ్‌ జాయ్‌ యువాన్‌ (హాంకాంగ్‌)పై కష్టపడి గెలిచింది.

మరోవైపు మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కి రెడ్డి (భారత్‌) ద్వయం 21–16, 22–20తో ఎన్‌ సు యు– యెన్‌ సిన్‌ యింగ్‌ (హాంకాంగ్‌) జోడీపై నెగ్గి రెండోరౌండ్‌కు చేరుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలోనే భారత్‌కు వ్యతిరేక ఫలితం ఎదురైంది. తొలి రౌండ్‌లో ప్రణవ్‌ చోప్రా– సిక్కిరెడ్డి (భారత్‌) జంట 19–21, 17–21తో రాబిన్‌ తాబులింగ్‌– సెలీనా పియెక్‌ (నెదర్లాండ్స్‌) జోడీ చేతిలో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. నేటి రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో వాంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)తో శ్రీకాంత్, ఆరోసీడ్‌ అంథోని సినిసుకా జింటింగ్‌ (ఇండోనేసియా)తో కశ్యప్, యిప్‌ పుయ్‌ యిన్‌ (హాంకాంగ్‌)తో సైనా ఆడతారు. మహిళల డబుల్స్‌ రెండో రౌండ్‌లో కెటుట్‌ మహాదేవి ఇస్తారాణి– రిజ్కీ అమేలియా ప్రదీప్త (ఇండోనేసియా) జోడీతో అశ్విని– సిక్కి జంట ఆడుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top