క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ | Ramkumar rallies into Chennai Open quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో రామ్‌కుమార్

Jan 8 2016 12:58 AM | Updated on Aug 20 2018 9:35 PM

భారత యువ టెన్నిస్ ఆటగాడు రామ్‌కుమార్ చెన్నై ఓపెన్‌లో నిలకడైన ప్రదర్శనతో దూసుకెళుతున్నాడు.

చెన్నై: భారత యువ టెన్నిస్ ఆటగాడు రామ్‌కుమార్ చెన్నై ఓపెన్‌లో నిలకడైన ప్రదర్శనతో దూసుకెళుతున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో తను 3-6, 6-4, 6-4తో కుద్రయెత్సేవ్ (రష్యా)పై గెలిచి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టాడు. ఏటీపీ టూర్ ఈవెంట్‌లో రామ్‌కుమార్ క్వార్టర్స్‌కు చేరడం ఇదే తొలిసారి. గత సీజన్ చివర్లో రెండు ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టైటిల్స్ సాధించిన రామ్‌కుమార్ వరుసగా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తూ వస్తున్నాడు. పురుషుల డబుల్స్‌లోనూ తను శ్రీరామ్ బాలాజీతో కలిసి క్వార్టర్స్‌కు చేరిన విషయం తెలిసిందే. కుద్రయెత్సేవ్‌తో పోరులో తొలిసెట్‌లో పేలవంగా ఆడిన రామ్‌కుమార్ రెండో సెట్‌లో పుంజుకున్నాడు. 3-3తో పాయింట్లు సమానంగా ఉన్న దశలో 23 షాట్ల పాటు సుదీర్ఘ ర్యాలీ సాగింది. పట్టువదలకుండా ఆడి 4-3 ఆధిక్యం సాధించి మరో రెండు గేమ్‌లను కూడా గెలుచుకుని సెట్ సాధించాడు. అదే జోరులో మూడో సెట్‌లోనూ గెలిచి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. క్వార్టర్స్‌లో రామ్‌కుమార్, అల్‌జాజ్‌ను ఎదుర్కోనున్నాడు.
 
 టోర్నీ నుంచి తప్పుకున్న పేస్
 తన డబుల్స్ సహచరుడు మార్సెల్ గ్రనోలెర్స్ (స్పెయిన్) అనారోగ్యం కారణంగా భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ చెన్నై ఓపెన్ నుంచి తప్పుకున్నాడు. గురువారం ఈ జోడి క్వార్టర్స్ ఆడాల్సింది. ‘చాలా నిరాశగా ఉంది. భారత అభిమానుల ముందు ఆడలేకపోతున్నాను’ అని పేస్ అన్నాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement