
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా ఇక్కడ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్-ఢిల్లీ డేర్డెవిల్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారింది. రాజస్తాన్ రాయల్స్ 17.5 ఓవర్లలో 153/5 వద్ద ఉండగా వర్షం పడింది. దాంతో మ్యాచ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రస్తుతం పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ డేర్డెవిల్స్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో బ్యాటింగ్కు దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆదిలోనే డీ ఆర్సీ షార్ట్(6) వికెట్ను కోల్పోయింది. ఆపై బెన్ స్టోక్స్(16) కూడా నిరాశపరచడంతో రాజస్తాన్ 23 పరుగులకే రెండు వికెట్లను చేజార్చుకుంది. ఆ తరుణంలో రహానే-సంజూ శాంసన్ల జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. శాంసన్(37; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మూడో వికెట్కు రహానేతో కలిసి 62 పరుగులు జత చేసిన తర్వాత పెవిలియన్ చేరాడు. కాసేపటికి రహానే(45;40 బంతుల్లో 5 ఫోర్లు) నాల్గో వికెట్గా ఔటయ్యాడు. ఇక జాస్ బట్లర్(29;18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఐదో వికెట్గా పెవిలియన్ చేరడంతో రాజస్తాన్ 150 పరుగుల వద్ద ఐదో వికెట్ను నష్టపోయింది.