ప్చ్‌... కశ్యప్‌ | Parupalli Kashyap Loses To Kento Momota in Semifinals | Sakshi
Sakshi News home page

ప్చ్‌... కశ్యప్‌

Sep 29 2019 3:08 AM | Updated on Sep 29 2019 3:08 AM

Parupalli Kashyap Loses To Kento Momota in Semifinals - Sakshi

ఇంచువాన్‌ (దక్షిణకొరియా): కొరియా ఓపెన్‌లో భారత సీనియర్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ విజయ పరంపర సెమీఫైనల్‌తో ముగిసింది. టోర్నీలో సింధు, సైనా, సాయి ప్రణీత్‌ సహా మిగతా స్టార్‌ షట్లర్ల పోరాటం తొలి రౌండ్‌తోనే ముగిసినా... సెమీస్‌ వరకు వచ్చిన కశ్యప్‌కు ప్రపంచ నంబర్‌ వన్‌ కెంటో మొమోటా (జపాన్‌) అడ్డుకట్ట వేశాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ హైదరాబాద్‌ ఆటగాడు 13–21, 15–21తో వరుస గేమ్‌ల్లో పరాజయం పాలయ్యాడు.  రెండుసార్లు ప్రపంచ చాంపియన్, టాప్‌ సీడ్‌ మొమోటా 40 నిమిషాల్లో కశ్యప్‌ను ఇంటిదారి పట్టించాడు.

క్వాలిఫయింగ్‌ రౌండ్‌ ద్వారా ఒక్కో అడుగు వేస్తూ వచి్చన కశ్యప్‌ టాప్‌ సీడ్‌ ధాటికి సెమీస్‌లో నిలువలేకపోయాడు. తొలి గేమ్‌ ఆరంభమైన కాసేపటికే జపాన్‌ ఆటగాడు 9–5తో ఆధిక్యంలోకి వచ్చాడు. మధ్యలో పాయింట్లు సంపాదించినా మొమోటా ముందు అవి సరిపోలేదు. రెండో గేమ్‌లో 7–2తో ఆధిపత్యం చాటిన టాప్‌సీడ్‌ కొన్ని అనవసర తప్పిదాలతో పాయింట్లు కోల్పోయాడు. ఇదే అదనుగా కశ్యప్‌ 11–12 స్కోరుతో దీటుగా కదిలాడు. వెంటనే తేరుకున్న జపాన్‌ స్టార్‌ వరుసగా పాయింట్లు సాధిస్తూ 19–13 స్కోరుకు చేరాడు. తర్వాత మ్యాచ్‌ గెలిచేందుకు అతడికి మరెంతోసేపు పట్టలేదు. కశ్యప్‌కు మొమోటా చేతిలో ఇది మూడో ఓటమి.   

Advertisement
 
Advertisement
Advertisement