సైనాకే అవకాశాలెక్కువ! | Parupalli Kashyap feels Saina Nehwal is the best medal prospect | Sakshi
Sakshi News home page

సైనాకే అవకాశాలెక్కువ!

Jul 11 2016 1:35 AM | Updated on Sep 4 2017 4:33 AM

సైనాకే అవకాశాలెక్కువ!

సైనాకే అవకాశాలెక్కువ!

ప్రస్తుత ఫామ్, ర్యాంకింగ్స్‌ను బట్టి చూస్తే రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచే అవకాశాలు సైనా నెహ్వాల్‌కే ఎక్కువగా ఉన్నాయని...

* అండర్‌డాగ్స్‌గా సింధు, శ్రీకాంత్
* రియో ఒలింపిక్స్‌పై కశ్యప్ అభిప్రాయం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఫామ్, ర్యాంకింగ్స్‌ను బట్టి చూస్తే రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచే అవకాశాలు సైనా నెహ్వాల్‌కే ఎక్కువగా ఉన్నాయని కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్ పారుపల్లి కశ్యప్ అన్నాడు. అయితే అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగే సింధు, శ్రీకాంత్‌ల నుంచి కూడా కొంతమేరకు ఆశించొచ్చన్నాడు. పురుషుల డబుల్స్‌లో మను అత్రి-సుమీత్ రెడ్డిలు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంపై కశ్యప్ సంతోషం వ్యక్తం చేశాడు. అయితే ‘రియో’లో పతకం సాధించడం చాలా కష్టంతో కూడుకున్నదే అయినప్పటికీ...

భారత్ నుంచి అర్హత కావడం మాత్రం అద్భుతమైన విషయమన్నాడు. ‘మను-సుమీత్‌లు పతకానికి పోటీదారులు కారని నేను చెప్పను. కానీ ఇక్కడ పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. అందులోనూ వీళ్లు తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. అయితే ఇక్కడ కూడా మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని జంటకు కూడా పతకం గెలిచే అవకాశాలున్నాయి. పెద్ద టోర్నీల్లో ఈ ఇద్దరూ చాలా బాగా ఆడతారు’ అని ఈ హైదరాబాదీ పేర్కొన్నాడు. మార్చిలో జరిగిన జర్మన్ ఓపెన్‌లో మోకాలి గాయానికి గురైన కశ్యప్... రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేకపోయిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement