డోపింగ్‌ టెస్టులో దొరికిన పాక్‌ క్రికెటర్‌! | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 11 2018 9:17 AM

Pak Cricketer Ahmed Shehzad Has Failed Dope Test - Sakshi

ఇస్లామబాద్‌: పాకిస్తాన్‌ క్రికెటర్‌ అహ్మద్‌ షెహజాద్‌ డోపింగ్‌ పరీక్షలో దోషిగా తేలాడు. అతడు నిషేదిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు రుజువైంది. ఈ విషయాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అతనికి నోటిసులు జారీ చేస్తూ.. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు బోర్డు అధికారిక ట్విటర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. షెహజాద్‌ పాకిస్తాన్‌లోనిర్వహించిన పరీక్షల్లోనే డోపింగ్‌కు పాల్పడినట్లు రుజువైందని, కానీ భారత్‌లోని ల్యాబ్‌కు పంపించి పీసీబీ మరోసారి ని‍ర్ధారించుకుందని డాన్‌ పత్రిక పేర్కొంది. గత జూన్‌లో పేరు చెప్పకుండా ఓ క్రికెటర్‌ డోపింగ్‌ పాల్పడ్డాడని తెలిపిన పీసీబీ రిపోర్టులు అందడంతో నోటీసులు జారీ చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం ఎలాంటి క్రికెట్‌ ఆడకుండా షెహజాద్‌పై కొంత కాలం నిషేదం పడే అవకాశం ఉంది.

నిలకడలేమి ఆటతో జట్టులో చోటు కోల్పోయిన 26 ఏళ్ల షెహజాద్‌.. స్కాట్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఆస్ట్రేలియా, జింబాంబ్వేలతో జరిగిన ముక్కోణపు సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక డోప్‌ టెస్టులో విఫలమైన పాక్‌ క్రికెటర్లలో షెహజాద్‌ మొదటి వాడేం కాదు.. 2012లో డోప్‌ టెస్టులో విఫలమైన పాక్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ రాజా హసన్‌ రెండేళ్ల నిషేదం ఎదుర్కొనగా.. యాసిర్‌ షా, అబ్దుర్‌ రెహమాన్‌లు తాత్కాలిక నిషేదాలు ఎదుర్కొన్నారు.

Advertisement
Advertisement