కివీస్ స్థంభించింది | New Zealand cricket coach praises Brendon Mccullum | Sakshi
Sakshi News home page

కివీస్ స్థంభించింది

Feb 20 2014 1:24 AM | Updated on Sep 2 2017 3:52 AM

భారత్‌తో రెండో టెస్టులో బ్రెండన్ మెకల్లమ్ తన బ్యాటింగ్‌తో జాతి యావత్తునూ ఒక్క క్షణం స్థంభింపజేశాడని న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు.

 మెకల్లమ్ ఇన్నింగ్స్‌పై కోచ్ వ్యాఖ్య

 వెల్లింగ్టన్: భారత్‌తో రెండో టెస్టులో బ్రెండన్ మెకల్లమ్ తన బ్యాటింగ్‌తో జాతి యావత్తునూ ఒక్క క్షణం స్థంభింపజేశాడని న్యూజిలాండ్ కోచ్ మైక్ హెస్సన్ అన్నాడు.  తొలి ఇన్నింగ్స్‌లో వైఫల్యంతో ఓటమి బాటలో పయనించిన కివీస్... ఆపై రెండో ఇన్నింగ్స్‌లో మెకల్లమ్ ట్రిపుల్ సెంచరీ కారణంగా పట్టు సాధించడం, చివరికి మ్యాచ్‌ను డ్రాగా ముగించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో హెస్సన్ మాట్లాడుతూ... మెకల్లమ్ పోరాడిన తీరు దేశ ప్రజలందరినీ సంతోషంలో ముంచెత్తిందని, తాను కోచ్‌గానే కాకుండా న్యూజిలాండ్ జాతీయుడిగా గర్విస్తున్నానని అన్నాడు.  ‘మెకల్లమ్ అద్భుత ఆటతీరుకు దేశమంతా గర్విస్తోంది. అతడు పోరాడిన తీరు మేం క్రికెట్ ఎలా ఆడతామో చాటిచెప్పింది. అభిమానుల నుంచి కూడా చక్కటి మద్దతు లభించింద’ని హెస్సన్ అన్నాడు. 2015 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియాతో కలిసి ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో వన్డే, టెస్టు సిరీస్‌లలో తాజా విజయాలు తమకు శుభసూచకాలని తెలిపాడు.

 ఇక న్యూజిలాండ్ మీడియా... మెకల్లమ్‌కు దిగ్గజాల సరసన చోటు కల్పించింది. రిచర్డ్ హ్యాడ్లీ 1986లో 300వ టెస్టు వికెట్ సాధించిన క్షణాన్ని మెకల్లమ్ ట్రిపుల్ సెంచరీ గుర్తుకు తెచ్చిందని ‘డొమినియన్ పోస్ట్’ పేర్కొంది. కాగా, న్యూజిలాండ్ హెరాల్డ్ పత్రిక తమ మొదటి పేజీలో మెకల్లమ్ రెండు చేతులతో ఆకాశాన్నందుకున్నట్లుగా ఫొటోను ప్రచురించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement