పెద్దావిడ కోసం దిగొచ్చిన మహేంద్రుడు

MS Dhoni Meets And Selfies An Elderly Fan Post Match Against Mumbai - Sakshi

ముంబై: మహేంద్ర సింగ్‌ ధోని ఈ పేరులోనే వైబ్రేషన్‌ ఉంది.. రికార్డుల సెన్సేషన్‌ ఉంది. అసాధ్యం అనుకున్న రికార్డులను సుసాధ్యం చేసి చూపించిన సారథి అతడు. కేవలం ఆటతోనే కాకుండా మంచి మనసుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంత చేసుకున్నాడు. ఇక ఏమి లెక్క చేయకుండా ధోని కోసం మైదానంలోకి దూసుకొచ్చి అతడిని అభిమానులు కలవడం ఈ మధ్య కాలంలో చాలానే చూస్తున్నాం. అయితే తాజాగా ముంబైలోని వాంఖడే మైదానంలో ఓ ప్రత్యేక అభిమానిని ధోని కలుసుకున్నాడు. ధోనిని అమితంగా అభిమానించే ఓ పెద్దావిడ కల ఫలించింది.
బుధవారం స్థానిక వాంఖడే మైదానంలో చెన్నైసూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఓ వృద్దురాలు ‘ఐ యామ్‌ హియర్‌ ఓన్లీ ఫర్‌ ధోని’అనే ఫ్లకార్డుతో స్టేడియంలో కనిపించింది. మ్యాచ్‌ ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండటంతో ఈ విషయాన్ని ధోనికి తెలియజేశారు. ధోని వచ్చేవరకు తన మనవరాలితో కలిసి అక్కడే ఎదురుచూసింది.  కాసేపటికి డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి వచ్చిన ధోని వారితో కాసేపు ముచ్చటించి సెల్ఫీ దిగాడు. అనంతరం తన సంతకంతో కూడిన జెర్సీని బహుమానంగా ఇచ్చాడు. దీంతో ఆ పెద్దావిడ ఆనందానికి అవధులు లేవు. ధోనిని కలవాలనే తన కల నేటితో తీరిందని ఎంతో ఉద్వేగంగా చెప్పింది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ధోని మరోసారి ఫ్యాన్స్‌ మనసు దోచుకున్నాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 37 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ముంబై నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో కేవలం 133 పరుగులకే పరిమితమైంది. దీంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకు హ్యాట్రిక్‌ విజాయాలతో జోరు మీదున్న సీఎస్‌కేకు ముంబై ఇండియన్స్‌ చెక్‌ పెట్టింది. ఇక సీఎస్‌కే తన తరువాతి మ్యాచ్‌ శనివారం కింగ్స్‌ పంజాబ్‌తో తలపడనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top