మరోసారి శివం మావిని కుమ‍్మేశారు..!

Mavi has conceded second time more than 28 in an over in this IPL - Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ధాటిగా బ్యాటింగ్‌ ఆరంభించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి, జోస్‌ బట్లర్‌లు చెలరేగి ఆడి జట్టును స్కోరు పరుగులు పెట్టించారు. కేకేఆర్‌ బౌలర్‌ శివం మావి వేసిన తొలి ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే తీసిన రాజస్తాన్‌.. ఆపై విజృంభించింది. రెండో ఓవర్‌లో 19 పరుగులు, మూడో ఓవర్‌లో 28 పరుగులు సాధించి స్కోరులో వేగాన్ని పెంచింది. అయితే రెండో ఓవర్‌ను ప్రసిధ్‌ వేయగా, మూడో ఓవర్‌ను శివం మావి వేసి భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

తొలి ఓవర్‌ను కుదురుగా వేసిన మావి.. మూడో ఓవర్‌లో మాత్రం జోస్‌ బట్లర్‌ ధాటికి తలవంచాడు. మావి వేసిన మూడో ఓవర్‌ తొలి బంతిని ఫోర్‌ కొట్టిన బట్లర్‌.. రెండో బంతిని సిక్సర్‌గా, మూడో బంతిని ఫోర్‌గా‌, నాల్గో బంతిని ఫోర్‌గా‌, ఐదో బంతిని సిక్సర్‌గా‌, ఆరో బంతిని ఫోర్‌గా మలిచాడు. దాంతో ఈ ఐపీఎల్‌ సీజన్‌లో శివం మావి ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులకు ఇచ్చిన అప్రతిష్టను రెండోసారి మూటగట్టుకున్నాడు. అంతకుముందు ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో మావి 29 పరుగులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  అప్పుడు శ్రేయస్‌ అయ్యర్‌.. ఇప్పుడు బట్లర్‌లు మావిని కుమ్మేశారు. ఫలితంగా తాజా ఐపీఎల్‌లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్లలో జాబితాలో తొలి రెండు స్థానాల్లో మావినే నిలిచాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top