'నాకు పాక్ ఆర్మీలో జాయిన్ కావాలని ఉంది'

'నాకు పాక్ ఆర్మీలో జాయిన్ కావాలని ఉంది'


ఆంటిగ్వా: పాకిస్తాన్ లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు జరిగేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సహకరించాలంటూ వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ విజ్ఞప్తి చేశాడు. సాధ్యమైనంత త్వరలో చర్యలు చేపట్టి ఆ దేశంలో క్రికెట్ క్రీడను బతికించాలని విన్నవించాడు. ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) టైటిల్ ను పెషావర్ జల్మీ గెలిచిన అనంతరం జీయో టీవీతో మాట్లాడిన శామ్యూల్స్.. ఆ దేశ క్రికెట్ కు స్సోర్ట్స్ గవర్నింగ్ బాడీ అండగా నిలవాలని కోరాడు.


 


పాకిస్తాన్ లో క్రికెట్ కు విపరీతమైన ఆదరణ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో విదేశీ జట్లు అక్కడ మ్యాచ్ లు ఆడటానికి వెనుకడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా భద్రతాపరమైన ఇబ్బందులు ఉండటంతో ఏ జట్టు కూడా అక్కడ ఆడే సాహసం చేయడం లేదు. దీనిపై శామ్యూల్స్  తనదైన శైలిలో స్పందించాడు. 'అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు తిరిగి పాక్ కు రావాలి. అంతవరకూ అదే విషయాన్ని నేను ప్రమోట్ చేస్తూ ఉంటా. దాని కోసం ఏమైనా చేస్తా. నాకు పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అయ్యే అవకాశం ఇవ్వండి. జమైకాలో నేను సైనికుణ్ని. పాక్ లో కూడా సైనికుడిగా సేవలందించడానికి సిద్ధంగా ఉన్నా. పాకిస్తాన్ కు సేవలందించడానికి ఆ దేశ ఆర్మీ సూట్ ను ఎందుకు ధరించకూడదు. పాక్ కు ఎప్పుడు నా అవసరం ఉన్నా సిద్ధంగా ఉంటా.  పాక్ ఆర్మీ మెటాలిక్ బ్యాడ్జీని నా భుజాలపైకి వస్తే చచ్చేంత వరకూ సేవలందిస్తా. దాని కోసం ఎదురుచూస్తూ ఉంటా 'అని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాతో తో భేటీ సందర్బంగా శామ్యూల్స్ వ్యాఖ్యానించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top