క్రిస్‌లిన్‌ విజృంభణ.. పంజాబ్‌కు భారీ లక్ష్యం | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 21 2018 5:51 PM

KKR Set Target of 192 Runs Against KXIP - Sakshi

కోల్‌కతా : సొంతగడ్డపై కింగ్స్‌పంజాబ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ క్రిస్‌లిన్‌ విజృంభించాడు. దీంతో పంజాబ్‌కు 192 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే నరైన్‌(1) వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఊతప్పతో లిన్‌ దాటిగా ఆడాడు. వీరిద్దరు రన్‌రేట్‌ తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి కోల్‌కతా 50 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడు పెంచిన ఉతప్ప34(23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సు).. అశ్విన్‌ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్‌ చేరాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.  ఆ వెంటనే నితీష్‌ రానా లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ బాధ్యాతాయుతంగా ఆడగా.. మరో వైపు క్రిస్‌లిన్‌ రెచ్చిపోయాడు. ఈ దశలో 30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో క్రిస్‌లిన్‌ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోరు 147 పరుగుల వద్ద ఆండ్రూ టై బౌలింగ్‌లో కీపర్‌ క్యాచ్‌గా క్రిస్‌లిన్‌71(41 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్సులు) పెవిలియన్‌ చేరాడు. దీంతో నాలుగో వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రస్సెల్‌(10) నిరాశపరిచాడు.

కట్టడి చేసిన పంజాబ్‌
చివర్లో పంజాబ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో కార్తీక్‌ 43(28 బంతులు, 6 ఫోర్లు‌) దాటిగా ఆడే ప్రయత్నంలో క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే టామ్‌ కుర్రాన్‌(1) సైతం వికెట్‌ సమర్పించుకున్నాడు. అండర్‌-19 స్టార్‌ శుభ్‌మన్‌గిల్‌(14 నాటౌట్‌), పియూష్‌ చవ్లా(2 నాటౌట్‌)లుగా నిలిచారు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది. ఇక చివరి రెండో ఓవర్లో కోలకతాకు కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి. పంజాబ్‌ బౌలర్లలో బీబీశ్రన్‌, ఆండ్రూ టైలు రెండు వికెట్లు తీయగా.. ముజీబ్‌, అశ్విన్‌లు తలా ఓ వికెట్‌ తీశారు.

Advertisement
Advertisement