
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత రెజ్లర్ల కథ మారలేదు. తొలి రోజు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన భారత రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. ఆదివారం గ్రీకో–రోమన్ విభాగంలో బరిలో నిలిచిన మనీశ్ (67 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) తొలి రౌండ్లో నిష్క్రమించగా... రవి (97 కేజీలు) రెండో రౌండ్లో ఓడాడు. మొదటి రౌండ్లో రవి 5–0తో చెంగ్ హో చెన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. అనంతరం జరిగిన రెండో రౌండ్లో రవి 0–7తో ఆర్టర్ ఒమరొవ్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడాడు. అంతకుముందు జరిగిన 67 కేజీల విభాగం తొలి రౌండ్లో మనీశ్ 1–10తో డేవిడ్ తిహోమిరొవ్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో, 87 కేజీల విభాగంలో సునీల్ 0–6తో జోసెఫ్ పాట్రిక్ (అమెరికా) చేతిలో ఓడారు. నేడు గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), మనీశ్ (60 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలో దిగుతారు.