టీమిండియా నిలకడగా.. | India fight their way to a strong lead | Sakshi
Sakshi News home page

టీమిండియా నిలకడగా..

Dec 8 2018 2:16 PM | Updated on Dec 15 2018 2:49 PM

India fight their way to a strong lead - Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. చతేశ్వర పుజారా(40 బ్యాటింగ్‌; 121 బంతుల్లో 4 ఫోర్లు), రహానే(1 బ్యాటింగ్‌; 15 బంతుల్లో) క్రీజ్‌లో ఉన్నారు. ఈ రోజు భారత ఇన్నింగ్స్‌ను మురళీ విజయ్‌-కేఎల్‌ రాహుల్‌లు కుదురుగా ఆరంభించారు. ప్రధానంగా రాహుల్‌ నిలకడగా ఆడాడు.

కాగా, భారత్‌ జట్టు తొలి వికెట్‌కు 63 పరుగులు జత చేసిన తర్వాత మురళీ విజయ్‌(18) పెవిలియన్‌ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో రాహుల్‌(44; 67 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) కూడా నిష్క్రమించడంతో భారత్‌ 76 పరుగుల వద్ద రెండో వికెట్‌ను నష్టపోయింది. అయితే చతేశ్వర పుజారా-విరాట్‌ కోహ్లిల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 71 పరుగులు భాగస్వామ‍్యం నెలకొల్పిన అనంతరం కోహ్లి(34;104 బంతుల్లో 3 ఫోర్లు) మూడో వికెట్‌గా ఔటయ్యాడు.

అంతకుముందు 191/7 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆసీస్‌.. మరో 44 పరుగులు చేసి మిగతా మూడు వికెట్లును కోల్పోయింది. ఓవర్‌నైట్‌ ఆటగాడు మిచెల్‌ స్టార్క్‌ ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. స్టార్క్‌ను బూమ్రా ఔట్‌ చేయగా, చివరి రెండు వికెట్లను షమీ తీశాడు. ట్రావిస్‌ హెడ్‌(72) తొమ్మిదో వికెట్‌గా ఔట్‌ కాగా, హజల్‌వుడ్‌(0) ఆఖరి వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 235 పరుగుల వద్ద ముగిసింది. దాంతో భారత్‌కు 15 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ దక్కింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement