లంకపై భారత్‌ జయభేరి | India beat Sri Lanka, keep finals hope alive | Sakshi
Sakshi News home page

లంకపై భారత్‌ జయభేరి

Jun 8 2018 1:48 AM | Updated on Nov 9 2018 6:46 PM

India beat Sri Lanka, keep finals hope alive - Sakshi

కౌలాలంపూర్‌: గత మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న భారత మహిళల జట్టు ఆసియా కప్‌ టి20 టోర్నీ నాలుగో లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక... భారత బౌలర్ల ధాటికి 7 వికెట్ల నష్టానికి 107 పరుగులకే పరిమితమైంది. హసిని పెరీరా (43 బంతుల్లో 46 నాటౌట్‌; 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. ఏక్తా బిష్త్‌ (2/20), జులన్‌ గోస్వామి (1/20), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అనూజ పాటిల్‌ (1/19), పూనమ్‌ యాదవ్‌ (1/23) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆ జట్టులో ఏడుగురు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం టాపార్డర్‌ సమష్టిగా రాణించడంతో భారత్‌ 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసి గెలిచింది. మిథాలీ రాజ్‌ (23), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (24), వేద కృష్ణమూర్తి (29 నాటౌట్‌; 4 ఫోర్లు) అనూజ పాటిల్‌ (19 నాటౌట్‌) తలా కొన్ని పరుగులు చేశారు. ఈ టోర్నీలో థాయ్‌లాండ్, మలేసియాలపై వరుస విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం గత మ్యాచ్‌లో బంగ్లా చేతిలో ఓడింది. 

మిథాలీ@ 2000... 
ఈ మ్యాచ్‌ ద్వారా భారత వన్డే కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ టి20ల్లో భారత్‌ తరఫున 2 వేల పరుగులు పూర్తి చేసిన తొలి క్రీడాకారిణిగా ఆమె రికార్డు సృష్టించింది. 35 ఏళ్ల మిథాలీ 74 మ్యాచ్‌లు ఆడి 2015 పరుగులు చేసింది. మొత్తంగా ఈ మైలురాయిని దాటిన ఏడో మహిళా క్రికెటర్‌ మిథాలీ. ఇంగ్లండ్‌ స్టార్‌ ఎడ్వర్ట్స్‌ (2,605) అగ్రస్థానంలో ఉంది. టి20 గణాంకాల్లో పురుషుల జట్టు కెప్టెన్‌ కోహ్లి (1,983) కూడా మిథాలీ కంటే వెనుకే ఉండటం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement