
'ఆమె నాకు తోడుగా నిలిచింది'
ఫామ్ కోల్పోయి చాలా కాలం పాటు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు దూరమైన షోయబ్ మాలిక్ ఇటీవల మళ్లీ జట్టులోకి వచ్చాడు.
కరాచీ: ఫామ్ కోల్పోయి చాలా కాలం పాటు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు దూరమైన షోయబ్ మాలిక్ ఇటీవల మళ్లీ జట్టులోకి వచ్చాడు. జింబాబ్వే, శ్రీలంకపై అద్భుత ప్రదర్శనతో మరోసారి తన స్థానం సుస్ధిరం చేసుకున్నాడు. ఈ మార్పునకు తన భార్య సానియా మీర్జానే కారణమని, ఆమె స్ఫూర్తితోనే పోరాడానని అతను చెప్పుకొచ్చాడు. 'కెరీర్ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె నాకు తోడుగా నిలిచింది.
వైఫల్యాలు వెంటాడినప్పుడు ప్రోత్సహించి ధైర్యం చెప్పింది. సానియా కూడా తన కెరీర్లో ఎంతో కష్టపడి పైకొచ్చింది. అదే స్ఫూర్తి, ఆమె సలహాలు నాపై ఎంతో ప్రభావం చూపించాయి. అందుకే పునరాగమనం చేయగలిగాను' అని మాలిక్ వ్యాఖ్యానించాడు. వ్యక్తిగత క్రీడల్లో సానియా ఎంతో గొప్ప స్థాయికి చేరిందని, అదే ఆమె విజయాలపై ప్రత్యేక గౌరవ భావం కలిగేలా చేసిందని మాలిక్ అన్నాడు.