క్వార్టర్‌ ఫైనల్లో గాయత్రి

Gayatri Gopichand Enters Quarters of Juniors Badminton Tourney - Sakshi

ఆలిండియా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా జూనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్లు పుల్లెల గాయత్రి, సామియా ఇమాద్‌ ఫరూఖీ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లారు. చెన్నైలో శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్‌ మూడోరౌండ్‌లో టాప్‌సీడ్‌ గాయత్రి 22–20, 21–16తో క్వాలిఫయర్‌ ఖుషీ గుప్తా (ఢిల్లీ)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సామియా ఇమాద్‌ ఫరూఖీ (తెలంగాణ) 21–11, 21–18తో కేయూర మోపాటి (తెలంగాణ)ని ఓడించింది. బాలు ర సింగిల్స్‌ విభాగంలో డి. శరత్‌ (ఆంధ్రప్రదేశ్‌) క్వార్టర్స్‌కు చేరుకోగా.... తరుణ్‌ (తెలంగాణ), ప్రణవ్‌ రావు (తెలంగాణ), సాయిచరణ్‌ (ఆంధ్రప్రదేశ్‌) మూడోరౌండ్‌లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. తొమ్మిదో సీడ్‌ శరత్‌ 21–11, 21–13తో ఎం. తరుణ్‌పై గెలుపొందగా... మూడో సీడ్‌ సాయిచరణ్‌ కోయ 22–24, 17–21తో పదో సీడ్‌ సిద్ధాంత్‌ గుప్తా (తమిళనాడు) చేతిలో, ప్రణవ్‌ రావు 17–21, 15–21తో ఐదో సీడ్‌ ఆకాశ్‌ యాదవ్‌ (ఢిల్లీ) చేతిలో పరాజయం పాలయ్యారు.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ నవనీత్‌–సాహితి (తెలంగాణ) ద్వయం 21–9, 24–26, 21–16తో మంజిత్‌ సింగ్‌ (మణిపూర్‌)–మెహ్రీన్‌ రిజా (కేరళ) జంటపై గెలు పొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. బాలికల డబుల్స్‌ తొలిరౌండ్‌లో ఏడో సీడ్‌ శ్రీవిద్య గురజాడ–సాయి శ్రీయ జంట 21–12, 21–9తో రుద్రాణి (ఉత్తరప్రదేశ్‌)–ఆత్మజయిత రాయ్‌ బర్మన్‌ (త్రిపుర) జోడీపై, సాహితి (తెలంగాణ)–ద్రితి (కర్ణాటక) జంట 21–8, 21–23, 21–14తో దుర్వా గుప్తా (ఢిల్లీ)–భార్గవి (తెలంగాణ) జోడీపై, హాసిని–జాహ్నవి (ఆంధ్రప్రదేశ్‌) జంట 22–24, 21–18, 21–16తో సాక్షి–యషిక (హరియాణా) జోడీపై గెలుపొంది రెండో రౌండ్‌లో అడుగుపెట్టాయి. బాలుర డబుల్స్‌ తొలిరౌండ్‌లో అచ్యుతాదిత్య రావు (తెలంగాణ)–వెంకట హర్ష (ఆంధ్రప్రదేశ్‌) జంట 21–14, 21–17తో నమన్‌–అర్జున్‌ (ఢిల్లీ) జోడీపై, తరుణ్‌–ఖదీర్‌ (తెలంగాణ) జంట 21–14, 12–21, 21–13తో అవినాశ్‌–ఆయుశ్‌ (ఒడిశా) జోడీపై, నవనీత్‌ (తెలంగాణ)–ఎడ్విన్‌ జాయ్‌ (కేరళ) జంట 21–15,21–15తో సనీత్‌–పృథ్వీ (కర్ణాటక) జోడీపై గెలుపొందాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top