ద్రవిడ్‌తో గంగూలీ భేటీ!

Ganguly Set To Meet Dravid To Discuss Of Indian Cricket - Sakshi

బెంగళూరు:  ఇటీవల భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్‌ గంగూలీ తన కార్యాచరణను ముమ్మరం చేశాడు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ)ని డే అండ్‌ నైట్‌ టెస్టు కోసం దాదాపు ఒప్పించిన గంగూలీ.. టీమిండియా రోడ్‌ మ్యాప్‌కు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేయబోతున్నాడు. ఈ మేరకు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ(ఎన్‌సీఏ) హెడ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో సమావేశం కానున్నాడు. బుధవారం బెంగళూరులో ద్రవిడ్‌తో గంగూలీ చర్చించనున్నాడు.

భారత క్రికెట్‌ జట్టు తరఫున సుదీర్ఘ క్రికెట్‌ ఆడిన అనుభవం ఉన్న ఇద్దరు ‘క్రికెట్‌ మిత్రులు’ తొలిసారి జట్టు గురించి సమాలోచన చేయనున్నారు. ద్రవిడ్‌ ఇచ్చే ఇన్‌పుట్స్‌ ఆధారంగా ఒక ప్రణాళిక రూపొందించాలని గంగూలీ భావిస్తున్నాడు. అదే సమయంలో ఎన్‌సీఏలో ద్రవిడ్‌ దృష్టికి వచ్చిన సమస్యలపై కూడా గంగూలీ ఆరా తీయనున్నాడు. ఈ సమావేశానికి ఎన్‌సీఏ సీఈఓ తుఫాన్‌ గోష్‌ కూడా హాజరు కానున్నారు.

సుమారు నాలుగేళ్ల  పాటు భారత్‌-ఏ, అండర్‌-19 జట్లకు ప్రధాన కోచ్‌గా పని చేసిన  ద్రవిడ్‌.. గత జూలై నెలలో ఎన్‌సీఏ హెడ్‌గా నియమించబడ్డారు. బీసీసీఐ కొత్తగా సృష్టించిన ఈ హెడ్‌ కోచ్‌ పదవికి పలువురు పోటీ పడ్డ అపార అనుభవం ఉన్న ద్రవిడ్‌నే నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. జూనియన్‌ స్థాయిలో భారత జట్టును విజయవంతంగా తీర్చిదిద్దిన ద్రవిడ్‌ ఆ పదవికి అన్ని విధాల అర్హుడని బీసీసీఐ పెద్దలు భావించారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top