ఎల్బీడబ్ల్యూలు మినహా... | BCCI to prepare for the debate on DRS | Sakshi
Sakshi News home page

ఎల్బీడబ్ల్యూలు మినహా...

Aug 24 2015 11:44 PM | Updated on Sep 3 2017 8:03 AM

సుదీర్ఘ కాలంగా అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)ని వ్యతిరేకిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు ఈ అంశంపై కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది...

డీఆర్‌ఎస్‌పై చర్చకు బీసీసీఐ సిద్ధం: అనురాగ్ ఠాకూర్
ముంబై:
సుదీర్ఘ కాలంగా అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)ని వ్యతిరేకిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పుడు ఈ అంశంపై కాస్త మెత్తబడినట్లు కనిపిస్తోంది. డీఆర్‌ఎస్ టెక్నాలజీపై మరో సారి చర్చించేందుకు తాము సిద్ధమని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. గతంలోలాగే తాము టెక్నాలజీ 100 శాతం సరిగ్గా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. అయితే డీఆర్‌ఎస్‌లో ఎల్బీని చేర్చరాదని ఠాకూర్ స్పష్టం చేశారు. ‘డీఆర్‌ఎస్ వాడేందుకు ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాం.

అయితే ఎల్బీడబ్ల్యూల విషయంలో మాత్రం దానిని ఉపయోగించవద్దని మేం కోరుతున్నాం. కొన్ని మార్పులతో బ్యాట్-ప్యాడ్, కీపర్ క్యాచ్‌లాంటి అంశాల విషయంలో సమీక్ష పద్ధతికి మేం సిద్ధం’ అని ఆయన వెల్లడించారు. బీసీసీఐని అవినీతిరహితంగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్న ఠాకూర్... లోధా కమిటీ ప్రతిపాదనలపై వర్కింగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికను ఈ నెల 28న బోర్డు వర్కింగ్ కమిటీ ముందు పెడతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement