భార్యలు, గర్ల్‌ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లాలంటే..

BCCI To Decide On WAGs Request - Sakshi

కెప్టెన్‌, కోచ్‌ల అధికారం కట్‌!

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు పర్యటనకు వెళ్లినప్పుడు ఆటగాళ్ల పర్యవేక్షణ బాధ్యత ఇప్పటివరకూ అటు కెప్టెన్‌తో పాటు కోచ్‌ అధీనంలో ఉండేది. ప్రత్యేకంగా విదేశీ పర్యటనల్లో తమ భార్యలతో కానీ గర్ల్‌ ఫ్రెండ్స్‌తో కానీ ఆటగాళ్లు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు కెప్టెన్‌ అనుమతితో పాటు కోచ్‌ అనుమతి తీసుకోవడం అనేది గత కొంతకాలంగా కొనసాగుతోంది. ఇక నుంచి ఆ అధికారులకు ముగింపు పలకడానికి భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) రంగం సిద్ధం చేసినట్లే కనబడుతోంది. ఒకవేళ భారత క్రికెట్‌ జట్టు వేరే దేశానికి పర్యటనకు వెళ్లినప్పుడు ఏ ఆటగాడైనా భార్యతో కానీ గర్ల్‌ఫ్రెండ్‌తో కానీ బయటకు వెళ్లి చక్కర్లు కొట్టి రావాలంటే దానికి బీసీసీఐ అనుమతి తప్పనిసరి చేయాలని భావిస్తోంది. బీసీసీఐ అనుమతి తీసుకుని అందుకు ఆమోదం లభించిన తర్వాతే ‘షికారు’కు వెళ్లాల్సి ఉంటుంది.

దీనిపై బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ భార్యలతో కానీ గర్ల్‌ ఫ్రెండ్స్‌తో కానీ ఆటగాళ్లు బయటకు వెళ్లాలనుకున్నప్పుడు బీసీసీఐలోని ఆఫీస్‌ బేరర్స్‌ అనుమతి తీసుకోవాలనే నిబంధనపై చర్చిస్తున్నాం. సదరు ఆటగాడు వ్యక్తిగతంగా ఆఫీస్‌ బేరర్స్‌ కు విషయాన్ని తెలియజేయాలి. ఇదేమీ పెద్ద సమస్య కాదు. ఎక్కడికి వెళుతున్నారో చెప్పి  అందుకు ఆమోదం పొందాలి. దాంతో ఆటగాళ్లు ఎక్కడు తిరిగారో అనే దానిపై ఒక స్పష్టత ఉంటుంది. అదే సమయంలో కెప్టెన్‌, కోచ్‌ల కూడా తలనొప్పి తగ్గి మ్యాచ్‌పై దృష్టి పెట్టడానికి వీలుంటుంది’ అని ఆ అధికారి పేర్కొన్నారు.

ఈ నిర్ణయాన్ని గతేడాది బీసీసీఐ పరిపాలన కమిటీ(సీఓఏ) తీసుకుంది. 2019, మే 21వ తేదీన జరిగిన సమావేశంలో సీఓఏ పెద్దలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేయడానికి సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని బీసీసీఐ సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రధానంగా కెప్టెన్‌, కోచ్‌లు ఆటగాళ్ల వ్యక్తిగత విషయాలు కాకుండా మ్యాచ్‌లపై ప్రణాళికలు సిద్ధం చేయడానికి తగినంత స్వేచ్ఛ దొరకుతుందని బీసీసీఐ భావిస్తోంది. దానిలో భాగంగానే ఈ మార్పుకు శ్రీకారం చుట్టాలనే తలంపుతో ఉన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top