టీమిండియా దెబ్బకు బంగ్లా ఢమాల్‌

Bangladesh Bundled For 150 Against India - Sakshi

ఇండోర్‌: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 58.3 ఓవర్లలో 150 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లకు దెబ్బకు బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైంది. గురువారం తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్‌ మోస్తరు పోరాటం మినహాయిస్తే ఆద్యంతం భారత్‌దే పైచేయిగా నిలిచింది. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు  సాధించగా, అశ్విన్‌, ఇషాంత్‌, ఉమేశ్‌లు తలో రెండు వికెట్లతో మెరిశారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను షాద్‌మన్‌ ఇస్లామ్‌, ఇమ్రుల్‌ కేస్‌లు ప్రారంభించగా వారిద్దరూ తలో ఆరు పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు.ఇషాంత్‌ వేసిన  ఆరో ఓవర్‌ చివరి బంతికి షాద్‌మన్‌ ఔట్‌ కాగా, ఆపై ఉమేశ్‌ యాదవ్‌ వేసిన ఏడో ఓవర్‌ ఆఖరి బంతికి ఇమ్రుల్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. షాదమ్‌న్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా పట్టగా, ఇమ్రుల్‌ ఇచ్చిన క్యాచ్‌ను రహానే అందుకున్నాడు. దాంతో 12 పరుగులకే బంగ్లాదేశ్‌ రెండు వికెట్లను చేజార్చుకుంది. మూడో వికెట్‌గా కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(37)ను అశ్విన్‌ ఔట్‌ చేయడంతో బంగ్లా నిలకడైన భాగస్వామ్యానికి తెరపడింది.(ఇక్కడ చదవండి: అశ్విన్‌ సరికొత్త రికార్డు)

ఇక ముష్పికర్‌ రహీమ్‌(43) ఒక్కడే బాధ్యతాయుతంగా ఆడాడు. రహీమ్‌ను బౌల్డ్‌ చేసిన షమీ.. ఆపై మరుసటి బంతికి మెహిదీ హసన్‌ను గోల్డెన్‌ డక్‌గా ఔట్‌ చేశాడు.  టీ బ్రేక్‌ తర్వాత ఇషాంత్‌ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే లిటాన్‌ దాస్‌(21) ఔట్‌ అయ్యాడు. 140 పరుగుల వద్దే బంగ్లా మూడు వికెట్లను కోల్పోయింది. అటు తర్వాత తైజుల్‌ ఇస్లామ్‌ రనౌట్‌ కాగా, చివరి వికెట్‌గా ఇబాదత్‌ హుస్సేన్‌(2) ఔటయ్యాడు. ఉమేశ్‌ యాదవ్‌ వేసిన బంతికి ఇబాదత్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఈ రోజు ఆటలో లంచ్‌ సమయానికి మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌.. ఆపై టీ విరామానికి వెళ్లే  సమయానికి మరో నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఆపై బంగ్లా ఇన్నింగ్స్‌ను టీమిండియా బౌలర్లు ఎక్కువ సేపు సాగనీయలేదు. వికెట్ల వేటను కొనసాగిస్తూ బంగ్లాను కట్టడి చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top