ఆరేళ్ల తర్వాత క్రికెట్‌లోకి అజయ్ జడేజా | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల తర్వాత క్రికెట్‌లోకి అజయ్ జడేజా

Published Fri, Aug 16 2013 2:01 AM

Ajay Jadeja set to return to competitive cricket after a gap of six years

ముంబై: భారత మాజీ ఆటగాడు అజయ్ జడేజా మరోసారి బ్యాట్ పట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. 42 ఏళ్ల వయస్సులో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ ఆడాలనే లక్ష్యంతో ఆరేళ్ల అనంతరం సీరియస్ క్రికెట్ ఆడాలని జడేజా భావిస్తున్నాడు. 90వ దశకంలో ఈ హర్యానా ఆల్‌రౌండర్ భారత మిడిలార్డర్‌లో కీలక ఆటగాడిగా సేవలందించాడు.

 

తాజాగా చెన్నైలో గురువారం ప్రారంభమైన బుచ్చిబాబు ఆలిండియా ఇన్విటేషన్ టోర్నీలో హర్యానాకు నాయకత్వం వహిస్తున్నట్టు ఓ పత్రికలో కథనం వచ్చింది. ఈ టోర్నీలో ప్రతిభ కనబరిచి ఐపీఎల్‌లో ప్రవేశించాలని భావిస్తున్నట్టు సమాచారం. 2007లో అతడు చివరిసారిగా రంజీ మ్యాచ్ ఆడాడు. 196 వన్డేల్లో ఆరు శతకాలతో 5,359 పరుగులు చేసిన ఈ మాజీ ఆటగాడు 1996 ప్రపంచకప్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. పాక్‌పై 25 బంతుల్లో 45 పరుగులు చేసి జట్టును గెలిపించడంతో అభిమానుల దృష్టిలో ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. అనంతరం మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇరుక్కుని ఐదేళ్ల పాటు బీసీసీఐ బహిష్కరణకు గురయ్యాడు.

Advertisement
Advertisement