‘చంద్రబాబు స్క్రిప్టును పవన్‌ చదువుతాడు’

YSRCP MLA Karumuri Nageswara Rao Slams On Chandrababu Naidu And Pawan Kalyan - Sakshi

సాక్షి,పశ్చిమ గోదావరి: రౌడీ షీటర్‌ చింతమనేని చూసి నేర్చుకోండి అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. బుధవారం తణుకు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎప్పుడూ 40 ఏళ్ల అనుభవం ఉందంటూ చెప్పుకునే చంద్రబాబుకు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 5 నెలల పాలన చూసి మింగుడుపడటం లేదన్నారు. సీఎం జగన్‌ ప్రభుత్వం ప్రాంతాలు, కులాలు, మతాలు చూడకుండా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో వైఎస్సార్‌ సీపీకి ప్రజలు నీరాజనం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో రౌడీయిజం పెచ్చు మీరిపోయిందని, ప్రజలకు 10 నెలలు ఇసుక ఇవ్వకుండా టీడీపీ నాయకులు దోచుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాలంటీర్లు తలుపు తడుతున్నారంటూ చంద్రబాబు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

నవరత్నాలు ప్రజల చేతుల్లోనే రాలుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబుపై కేసులు ఉన్నా ఆయన స్టే తీసుకుని కాలం గడుపుతున్నారని విమర్శించారు. టీడీపీ నాయకుల మాదిరి వైఎస్సార్‌ సీపీకి రౌడీయిజం చేయడం రాదని అన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే సీఎం జగన్‌ బాబాయ్‌ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగిందని.. హత్య రాజకీయాలకు తెరలేపింది చంద్రబాబే అని అన్నారు. ఇక బసవతారకం స్కూల్‌ పెట్టిన చంద్రబాబు అందులో ఎందుకు తెలుగు మీడియం ప్రవేశపెట్టలేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పిల్లలను ఇంగ్లీషు మీడియంలో స్కూళ్లలోనే చదవిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు స్క్రిప్టును పవన్‌ చదువుతారని ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top