‘ఆ విషయంలో చంద్రబాబు విజయం సాధించారు’

YSRCP Leader Sudhakar Babu Slams Chandrababu Naidu - Sakshi

వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌ బాబు ఎద్దేవా

సాక్షి, హైదరాబాద్‌: పేదవారిని మోసం చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు విజయం సాధించారని​ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు ఎద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైందని, పేదవాడికి చదువును కూడా అందని ద్రాక్షగా చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. విద్యావ్యవస్థను చైతన్య, నారాయణ సంస్థలకు తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మేనిఫెస్టోలో కులాలవారీగా వందల హామీలిచ్చారని, చంద్రబాబు రాజ్యాంగంపై ప్రమాణం చేసి అబద్ధపు పాలన చేశారని దుయ్యబట్టారు.

ఇంటికో ఉద్యోగం అని చెప్పి ప్రతి ఒక్కరిని నిలువునా ముంచేశారని, నాలుగున్నరేళ్లలో భూములను ఏ సంస్థలకు ఇచ్చారో.. ఎంత లాభం పొందారో ప్రజలకు చెప్పాలన్నారు. దళితుల పేరుతో నిధులు, భూములు కొల్లగొట్టారని, సబ్‌ప్లాన్‌ పేరుతో కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని మండిపడ్డారు. ఇసుక దోపిడి వివరాలు, భూములు లీజులు గడువు వివరాలు వెల్లడించాలన్నారు. గిరిజన ఎమ్మెల్యే హత్య వెనుక మూలాలు చంద్రబాబు వద్దే ఉన్నాయని, దళితులు, బడుగుల్లో ఒక్కరికైనా మైనింగ్‌ లీజులు ఇచ్చారా అని ప్రశ్నించారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో విచారణకు సహకరించడానికి సిద్దంగా ఉన్నామని, కానీ డీజీపీ ప్రకటనపై వివరణ కావాలన్నారు. వైఎస్‌ జగన్‌కు ప్రజలే రక్షణగా ఉండాలని ఈ సందర్భంగా సుధాకర్‌ బాబు విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top