పవన్ కల్యాణ్పై సినీనటుడు పృధ్వీరాజ్ ఫైర్
తొక్కతీస్తా, తాట తీస్తానంటే జనం సహించరు
సాక్షి, భీమవరం: రాజకీయాలు, సినిమాలు వేరనే విషయాన్ని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ గుర్తించకపోవడం అవివేకమని సినీనటుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫృధ్వీరాజ్ ఎద్దేవా చేశారు. ప్రచార సభల్లో పవన్కల్యాణ్, ఆయన సోదరుడు నాగబాబు మాట్లాడే భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. తొక్కతీస్తా, తాట తీస్తానంటే జనం సహించరని హెచ్చరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజుతో కలసి ఆదివారం ఆయన భీమవరంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్కల్యాణ్.. అన్నివిధాలుగా దోచుకుని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన టీడీపీని ప్రశ్నించకుండా, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం వెనుక ఆంతర్యాన్ని ప్రజలు గ్రహించారన్నారు. కనుమూరు రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ సినీ రంగంలో పవర్స్టార్గా పేరొందిన పవన్కల్యాణ్ రాజకీయాల్లో ప్యాకేజీ స్టార్గా మారి టీడీపీతో చేసుకున్న ప్యాకేజీ ఒప్పందాలను ప్రజలు, పవన్ అభిమానులు కూడా గ్రహించారన్నారు. పవన్ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీకి ఓట్లు వేయాలని ఎక్కడా అడగడంలేదని, జగన్కు ఓట్లు వేయవద్దని మాత్రమే ప్రచారం చేయడం వెనుక టీడీపీతో లాలూచీ వ్యవహారం బయటపడుతోందన్నారు. విలేకర్ల సమావేశంలో సినీనటుడు జోగినాయుడు, ఉండి మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, వైసీపీ నేత గుబ్బల తమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.