
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడును పెంచింది. హోదా అంశంపై పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్తున్న ఆ పార్టీ గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వంపై రేపే (శుక్రవారం) అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నోటీసులు ఇచ్చారు. లోక్సభ సెక్రటరీ జనరల్కు ఆయన నోటీసులు అందజేశారు. రాష్ట్ర విభజన సమయంలోనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందని, ఆ హామీనే విస్మరించిందని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. సభలో తమ అవిశ్వాస తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు.
వ్యూహం మార్చిన వైఎస్ఆర్సీపీ
వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని మార్చి 21న పెట్టాలని ముందు భావించింది. ఈ విషయంలో తమతో కలిసి రావాలని, అందుకు ఆలోచించుకునేందుకు రాష్ట్రంలోని అధికార పార్టీ టీడీపీ గడువు కోసమే ఆ తేదీని నిర్ణయించినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, అవిశ్వాసంపై మద్దతిస్తున్నామనిగానీ, లేదా తామే అవిశ్వాసం పెడతామనిగానీ టీడీపీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
దీంతో ముందునుంచి ప్రత్యేక హోదాపై పట్టువిడవకుండా పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ తాము అనుకున్న తేదీకంటే ముందే అవిశ్వాసం పెట్టాలని వ్యూహాత్మకంగా నిర్ణయాన్ని మార్చింది. మరోపక్క, పార్లమెంటు సమావేశాలను కుదించాలని కేంద్రం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో వేగంగా స్పందించి రేపే అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు. తాము పెట్టే తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఇప్పటికే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు లేఖలు ఇచ్చారు. మద్దతు కూడగట్టేందుకు వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. వైఎస్ జగన్ రాసిన లేఖలను అన్ని పార్టీలకు అందజేస్తున్నారు. ఇప్పటికే బీజేడీ, టీడీపీ, టీఆర్ఎస్ మద్దతుకోరారు.
వైఎస్ జగన్ రాసిన లేఖలను ఎవరెవరికి ఇచ్చారంటే..
కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత సౌగతా రాయ్, బీజేడీ నేత భర్తృహరి మెహతాబ్, టీడీపీ నేత తోట నరసింహం, టీఆర్ఎస్ లోక్సభ నేత జితేందర్ రెడ్డి, ఎన్సీపీ నేత తారిఖ్ అన్వర్, ఆప్ ఎంపీ భగవంత్ మన్ ను కలిసిన వైఎస్ఆర్ సీపీ ఎంపీలు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తితో వైఎస్ జగన్ రాసిన లేఖలను అందజేశారు.




